ఝరాసంగం, జూన్ 25: ఝరాసంగం ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి జాతీయ నాణ్యతా హామీ ప్రమాణాల గుర్తింపు (నేషనల్ క్వాలిటీ ఎష్యూరెన్స్ స్టాండర్డ్స్-ఎన్ క్వాస్) వరించినట్లు వైద్యాధికారి మాజిద్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 2022 సంవత్సరానికి ఆరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ఈ గుర్తింపు లభించింది. మే నెల 17,18 తేదీల్లో ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర వైద్య బృందం సభ్యులు పీహెచ్సీలో వైద్య సేవలు, పరిశుభ్రత, పచ్చదనం, రోగుల సంతృప్తి స్థాయి, సిబ్బంది ప్రవర్తన, క్షేత్రస్థాయిలో అందుతున్న సేవలు తనిఖీ చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందించారు. గ్రేడింగ్ పాయింట్ల ఆధారంగా 91శాతం గ్రేడ్ పాయింట్లతో ఎన్-క్వాస్ జాబితాల్లో ఝరాసంగం, రాయికోడ్ పీహెచ్సీలకు చోటు దక్కింది.
ప్రభుత్వ ఆరోగ్యకేంద్రాల్లో ఆత్యుత్తమ వైద్య ప్రమాణాలతో ప్రజలకు సేవలందించడమే లక్ష్యంగా కేంద్ర జాతీయ నాణ్యతా హామీ ప్రమాణాలను రూపొందించింది. మొత్తం అంశాల్లో పీహెచ్సీల పనితీరును సమీక్షిస్తారు. ఎన్- క్వాస్ ధ్రువీకరణతో పాటు మూడేండ్ల కాలపరిమితితో ఏటా రూ. 3 లక్షల నిధులు వైద్యులకు సిబ్బందికి ప్రోత్సాహకాలు మంజూరు చేస్తుంది. శనివారం ఎమ్మెల్యే మాణిక్రావు దవాఖానకు వచ్చి జాతీయ స్థాయి గుర్తింపు తీసుక వచ్చిన వైద్యసిబ్బందిని శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఆయన వెంట ఉమ్మడి జిల్లా డీసీ ఎంఎస్ చైర్మన్ శివకుమార్, సీడీసీ చైర్మన్ ఉమాకాంత్పాటిల్, సర్పంచ్లు బొగ్గుల జగద్వీర్, పరమేశ్వర్, ఎంపీటీసీ విజయేందర్రెడ్డి, టీఆర్ఎస మండలాధ్యక్షుడు మఠం రాచయ్యస్వామి, నరసింహులు, సంజీవ్,సిద్ధ్దన్నపటేల్, సిబ్బంది పాల్గొన్నారు.