సదాశివపేట, మే 28 : అది గుడికాదు కానీ అందులో శివుడు ఉన్నాడు. పిరమిడ్ కాదు కానీ అందులో ప్రశాంతంగా ధ్యానం చేసుకోవచ్చు. ఇంతకీ అది ఏమిటి అనుకుంటున్నారా? సదాశివపేట పట్టణంలోని రఘునాథస్వామి జానకమ్మ ఆశ్రమంలో నిర్మించిన గుండం బావి. బావిలోనే హాయిగా ధ్యానం చేసుకోవచ్చు. బావిలోపల చుట్టూ దీపాలు వెలిగించుకోవచ్చు. బావిలోకి దిగటానికి రెండు వైపులా మెట్లు ఉన్నాయి. సొరంగం తలపించే నిర్మాణం కూడా బావి సొంతం. సొరంగం లోంచి గుడిలోకి వెళ్లే మార్గం ఉన్నది. బావి మధ్యలో నీళ్లు ఉన్నాయి. ఇంతకీ దేవుడు ఎక్కడున్నాడు అనుకుంటున్నారా.. ఈ నీటి అడుగునా పరమశివుడు కొలువు దీరాడు. శివలింగాన్ని దర్శించాలంటే గుండంలోని నీళ్లు ఇంకిపోవాలి. ఈశ్వరుడు కరుణిస్తే తప్ప దర్శనభాగ్యం కలగదు. ఇలాంటి నిర్మాణ కవచలం ఉత్తర భారతదేశంలోనే కనిపిస్తాయని పూర్వీకులు చెబుతున్నారు. కానీ ఇలాంటి బావి సదాశివపేట లోని రఘునాథస్వామి జానకమ్మ ఆశ్రమంలో ఉన్నది.
గుండం బావి నిర్మాణం అద్భుతం..వంద అడుగుల లోతులో ఈ గుండం బావి ఉన్నది. 50 అడుగుల వరకు మెట్లు ఏర్పాటు చేశారు. ఇక అష్టదిక్కుల్లో మెట్లు ఏర్పాటు చేశారు. ఈ మెట్లు బావికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. నీళ్లు తోడు కోవడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గతంలో ఈ బావి నీటితో వ్యవసాయం కూడా సాగేది. 400 ఏండ్ల చరిత్ర ఉన్న ఈ బావి ఇప్పటికీ చెక్కు చెదరలేదు. ఒక్క రాయికూడా ఊడలేదు. రఘునాథస్వామి ఆశ్రమానికి వచ్చే భక్తులు ఈ అద్భుత నిర్మాణం చూసి ఆశ్చర్య పోతుంటారు.
400 ఏండ్ల క్రితం నిర్మాణం
400ఏండ్ల క్రితం ఒక కుష్టువ్యాధిగ్రస్తుడు రఘునాథస్వామి జానకమ్మ ఆశ్రమానికి వచ్చాడు. అప్పుడు ఓ గుంతలాగా ఉండి అందులో నీరు ఉండేది. గుంతలోని నీళ్లు తాగితే నీకు వ్యాధి నయం అవుతుందని మహారాజ్ అతడికి చెప్తాడు. అప్పుడు అతను గుంతలో నీటిని తాగడంతో వ్యాధి నయం అవుతుంది. దీంతో ఈ గుంతకు గుండం కట్టిస్తానని మహారాజ్కు చెప్పాడు. 400 ఏండ్ల క్రితం అతను ఈ గుండం బావిని నిర్మించాడని స్థానికులు తెలిపారు.
ఇటువంటి గుండం ఎక్కడా చూడలేదు..
నా జీవిత కాలంలో ఇటువంటి గుండం ఎక్కడా చూడలేదు. చాలా పెద్ద నిర్మా ణం. వారి ఆలోచన ఎట్లా ఉందో కానీ ఈశ్వరుడు, గంగకు ప్రీతి అని ఇలాంటి కార్యక్రమం చేశారని అనుకుంటున్నా. గుండం బావిలో లింగం ఎందుకున్నదటే ఈశ్వరుడికి గంగ ఎంతో ప్రీతి కావున అదే ఉద్దేశంతో భక్తులు బావి నిర్మాణం చేశారని అనుకుంటున్నాం. ఇక్కడ ఎంతోమంది వ్యాధిగ్రస్తులు రాత్రి నిద్రచేసి వారి కోర్కెలను నెరవేర్చుకున్నారు.
– నర్సింహరావు కులకర్ణి, పుజారీ