సిద్దిపేట, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ప్రభుత్వ ప్రోత్సాహంతో జిల్లాలో రైతులు పెద్దఎత్తున ఆయిల్ పామ్ సాగుకు మొగ్గు చూపుతున్నారు. సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా మంత్రి హరీశ్రావు ఆయిల్పామ్(పామాయిల్) సాగుకు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. గతేడాది సిద్దిపేట జిల్లాలో ఆయిల్పామ్ సాగుకు శ్రీకారం చుట్టారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జిల్లాలోనే పామాయిల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట గ్రామంలో 60 ఎకరాల విస్తీర్ణంలో రూ.200 కోట్లతో ‘ఆయిల్ ఫెడ్’ ఆధ్వర్యంలో కర్మాగారం పెడుతున్నారు. అత్యాధునిక సాంకేతికతో గంటకు 60 టన్నుల సామర్థ్యం గల గెలల గానుగ చేసే కర్మాగారాన్ని, అన్ని ఉత్పత్తులు ఉపయోగించుకునేలా, ఎలాంటి వ్యర్థం బయటికి రాకుండా పరిశ్రమను నెలకొల్పుతున్నారు. ఈ పరిశ్రమకు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖల మంత్రి హరీశ్రావు, ఆయిల్ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి బుధవారం ఉదయం శంకుస్థాసన చేయనున్నారు. అనంతరం ఐదు వేల మంది రైతులతో సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. ఆయిల్పామ్ సాగుపై శాస్త్రవేత్తలతో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. సమావేశానికి జిల్లా నలుమూలల నుంచి రైతులను ఆహ్వానించారు. ఈ పరిశ్రమను రానున్న రోజుల్లో ఆయిల్పామ్ సాగు విస్తీర్ణానికి అనుగుణంగా ఎక్కువ మొత్తంలో గెలల ఉత్పత్తి పెరిగినప్పుడు కర్మాగారం సామర్థ్యం గంటకు 120 టన్నుల వరకు పెంచుకునే ప్రణాళికను ముందే సిద్ధం చేశారు.
సిద్దిపేట జిల్లాలో 50వేల ఎకరాలకు వరకు సాగుచేసేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఇప్పటి వరకు 5వేల ఎకరాలకు వరకు సాగు చేశారు. ఈ యేడాది 20వేల ఎకరాలు, వచ్చే ఏడాది మరో 20వేల ఎకరాలు సాగు చేసే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే జిల్లా నుంచి రైతులు విడతల వారీగా ఖమ్మం జిల్లా అశ్వారావుపేటకు వెళ్లి, క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించారు. రంగనాయకసాగర్ వద్ద రెండు నర్సరీల్లో ఆయిల్పామ్ మొక్కలు పెంచుతున్నారు. జిల్లాకు సరిపడే మొక్కలను ఇక్కడి నుంచి పంపిణీ చేస్తారు.
రాష్ట్రంలోనే ఒక మోడల్ పరిశ్రమగా నర్మెట..
రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా మోడల్గా నర్మెటలో పామాయిల్ ఫ్యాక్టరీని తీర్చిదిద్దనున్నారు. కర్మాగారం ప్రాంగణంలోనే గెలల గానుగ ఆడే పరిశ్రమతో పాటు ఆయిల్ రిఫైనరీ మిషన్లను నెలకొల్పుతారు. 60 ఎకరాల విస్తీర్ణంలో సుమారు రూ.200 కోట్లతో నిర్మించనున్నారు. ఏడాదిలోగా ఫ్యాక్టరీని వినియోగంలోకి తెచ్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఫ్యాక్టరీలో గంటకు 60 మెట్రిక్ టన్నులు ప్రాసెస్ కానున్నది. ఇక్కడి నుంచే 400 టన్నుల వరకు పామాయిల్ను చుట్టుపక్కల జిల్లాలకు ఎగుమతి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. అవసరాలను బట్టి ప్రాసెస్ యూనిట్ సామర్ధ్యం, ప్యాకింగ్ తదితర సౌకర్యాల పెంచుకుంటారు. హైదరాబాద్ దగ్గరలో ఉండడంతో అక్కడికి ఎక్కువగా పామాయిల్ ఎగుమతి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఆయిల్పామ్ రైతులకు అనువైన మార్కెటింగ్ సదుపాయం ఇక్కడ కల్పించారు. రైతులు గెలలను నేరుగా నర్మెట ఫ్యాక్టరీకి తెచ్చి, దిగుమతి చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తున్నారు. ఈ పరిశ్రమ ఏర్పాటుతో ప్రత్యక్షంగా, పరోక్షంగా వందలాది మందికి ఉపాధి దొరుకుతుంది.
ఆయిల్పామ్ సాగు ప్రాముఖ్యత…
ప్రపంచంలో అత్యధిక దిగుబడి నిచ్చే నూనెగింజల పంటలో ఆయిల్పామ్ ఒకటి. వంట నూనెల వినియోగం ప్రపంచ వ్యాప్తంగా 33శాతం, భారతదేశం 60శాతం ఉంటుంది. మలేషియా, ఇండోనేషియా నుంచి రూ.లక్ష కోట్ల విలువైన కోటి మెట్రిక్ టన్నుల ముడి పామ్ ఆయిల్ను ఏటా భారతదేశం దిగుమతి చేసుకుంటున్నది. పెరుగుతున్న జనాభాకు తగ్గట్టు వంటనూనెల ఉత్పత్తి దేశీయంగా జరగకపోవడంతో విదేశాలపై ఆధారపడాల్సి వస్తున్నది. ఇతర నూనె గింజల పంటలతో పోలిస్తే ఆయిల్పామ్ తోటల నుంచి అత్యధిక నూనె దిగుబడి (ఎకరానికి 1.6 నుంచి 2 టన్నుల సాధించవచ్చు) ఇస్తుంది. ఇదే ఇతర నూనె గింజ పంటల నుంచి ఎకరానికి కేవలం 0.4-0.8 టన్నులు వస్తుంది. వంట నూనెల అవసరాలను తీర్చడానికి, దేశం స్వయం సమృద్ధి సాధించడానికి ఆయిల్పామ్ సాగు మాత్రమే పరిష్కారం అని చెప్పాలి.
అంతర పంటల సాగు…
ఆయిల్పామ్ సాగులో అంతర పంటలను రైతులు సాగుచేసుకోవచ్చు. మూడేండ్ల వరకు ఆయిల్పామ్లో అంతర పంటలుగా వేరుశనగ, మిర్చి, అరటి, సోయాచిక్కుడు, పెసర, మినుములు, బొప్పా యి, పుచ్చ తదితర పంటలు పండించవచ్చు. ఆయిల్పామ్ ఆకులు విస్తరించే దాకా వేరు వ్యవస్థకు నష్టం వాటిల్లకుండా సాగు చేసుకొని, అంతర పంటల ద్వారా రైతులు అధిక ఆదాయం పొందుతున్నారు. ఐదేండ్ల తర్వాత ఆయిల్పామ్ తోటల్లో అంతర పంటలుగా నీడలో పెరిగే కోకో, అల్లం, అనస, ఔషధ మొక్కలు, పశుగ్రాసం వేసుకొని అదనంగా రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు ఒక ఎకరానికి రైతు పొందవచ్చు. ఆయిల్పామ్ మగ గెలలు, పీచు, వ్యర్థాలను సేంద్రియ ఎరువుగా వాడవచ్చు.
టన్ను గెల ప్రస్తుత ధర రూ.22,842
ప్రస్తుతం టన్నుకు రూ. 22,842 ధర ఉంది. అధిక ధర ఉండడంతో రైతులు సాగుకు మొగ్గు చూపుతుండగా, సిద్దిపేట, మెదక్ జిల్లాల్లో ఆయిల్పామ్ సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగనున్నది. ఆయిల్పామ్ తోటల సాగుపై ఖర్చులు పోను నికర ఆదాయం రూ.లక్షన్నర పైగా ఆర్జిస్తున్నారు. అత్యధిక దిగుబడి 12 నుంచి 14 టన్నులు. ఎకరాకు సరాసరి దిగుబడులు 8 నుంచి 10 టన్ను ల దిగుబడిని రైతులు పొందుతారు. సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు జిల్లాకు తెచ్చి, బీడు భూములను సస్యశ్యామలం చేశారు. సాగునీటికి ఇక్కడ ఢోకా లేదు. ఇక్కడ ఆయిల్పామ్ సాగుకు అనుకూల వాతావరణం ఉంది. ఇక్కడి ప్రాంతంలోనే ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తుండడంతో రైతులు ఇబ్బందులు లేకుండా పామ్ గెలలను అమ్ముకోవచ్చు.
ఆయిల్పామ్ సాగుతో ప్రయోజనాలు..
ఆయిల్పామ్ తోట ప్రకృతి వైపరీత్యాలను సమర్థవంతంగా తట్టుకుంటుంది.
మార్కెటింగ్, చెల్లింపులు తదితర వాటి పరంగా రైతులకు ఇది అత్యుత్తమ సురక్షిత పంటగా చెప్పవచ్చు.
కోతులు, అడవి పందులు తదితర అడవి జంతువుల నుంచి ఈ తోటలకు ఎలాంటి హాని లేదు. తెగుళ్లు, వ్యాధులు ఈ తోటల దరిచేరవు.
ఆయిల్పామ్ పెట్టిన నాలుగో ఏడాది నుంచి స్థిరమైన ఆదాయంతో 30 ఏండ్ల వరకు ఆదాయం వస్తుంది.
ఈ తోటలు పర్యావరణానికి చాలా అనుకూలమైన పంట. ఆయిల్ పామ్ గెలలు ఉత్పత్తి చేసే అమ్మకాల సమయంలో మధ్యవర్తులు దళారుల బెదడ లేకుండా, నేరుగా తమ ఉత్పత్తి చేసిన గెలలను గుర్తింపు చేసిన కంపెనీలకు అమ్ముకోవచ్చు.
ప్రతి 15 రోజులకు రైతుకు ఆదాయం సమకూరుతుంది. ఇతర పంటలు 6 నెలల తర్వాత ఆదాయన్ని రైతులు పొందుతారు. ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలోని జిల్లాలోని రైతుల పొలాల నుంచి గెలలు మిల్లులకు నేరుగా రవాణా చేసిన మూడు రోజులకు ఆయిల్పామ్ గెలల ఖరీదుతో పాటు రవాణా చార్జీలను కలిపి రైతు ఖాతాల్లోకి నేరుగా డబ్బులను చెల్లిస్తారు.
సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావుకు కృతజ్ఞతలు
నంగునూరు మండం నర్మెట గ్రామంలో ఆయిల్పామ్ పరిశ్రమ ఏర్పాటు చేస్తున్నందుకు సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావుకు మా రైతుల పక్షాన కృతజ్ఞతలు. నర్మెటలో పరిశ్రమ ఏర్పాటు అవుతుండడంతో ఈ ప్రాంత రైతులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ పరిశ్రమతో ప్రత్యక్షంగా, పరోక్షంగా వందలాది మందికి ఉపాధి దొరుకుతుంది. మంచి గిట్టుబాటు కలిగే సాగు కాబట్టి ప్రతి రైతు ముందుకు రావాలి. ఇప్పటికే మంత్రి హరీశ్రావు సహకారంతో అశ్వారావుపేటకు వెళ్లి, అక్కడి సాగు పద్ధతులు తెలుసుకున్నాం. నేను 15 ఎకరాల వరకు ఆయిల్పామ్ సాగు చేశా. మా పంటలు చేతికి వచ్చే వరకు ఫ్యాక్టరీ పూర్తవుతుంది.
– జాప శ్రీకాంత్రెడ్డి, మాజీ ఎంపీపీ, ఆయిల్పామ్ రైతు
ఆయిల్పామ్ సాగుతో సంతోషంగా ఉన్నా
ఆయిల్పామ్ సాగు చేయడంతో తాను సంతోషంగా ఉన్న. రాఘవాపూర్ వద్ద మంత్రి హరీశ్రావు రైతులకు అవగాహన కల్పించారు. వెంటనే నేను 19 ఎకరాల్లో సాగు చేశా. సాగులో రైతులు అంతర పంటలు పెట్టుకోవచ్చు. ఆయిల్పామ్ మొక్కలు గ్రోత్ బాగుంది. ప్రభుత్వం ఆయిల్పామ్ రైతులను ప్రోత్సహించడం అభినందనీయం. ఇక ఆయిల్పామ్ కంపెనీకి శంకుస్థాపన చేస్తుండడంతో రైతులు సంతోషంగా ఉన్నారు.
– గొట్టం వెంకటనర్సింహరెడ్డి రైతు, నాగపురి, చేర్యాల
మార్కెటింగ్కు భరోసా కలిగింది..
తెలంగాణ సర్కారు సూచన మేరకు నాకున్న నాలుగెకరాల్లో 230 ఆయిల్పామ్ మొక్కలు నాటా. జిల్లాలో పామాయిల్ పరిశ్రమ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది. పంటను ఎక్కడికి తీసుకపోయి అమ్మాలో అనే సందేహం లేకుండాపోయింది. జిల్లాలోనే పరిశ్రమను ఏర్పాటు చేయడంతో పంటకు మార్కెటింగ్ వసతి ఉంటుందన్న భరోసాతో కలిగింది.
– బైండ్ల భూపతి, రైతు, హబ్షీపూర్, దుబ్బాక
మరో నాలుగెకరాల్లో పెడుతా..
రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్పామ్ పంటకు అందిస్తున్న 75శాతం సబ్సిడీతో నేను ఇప్పటికే రెండెకరాల వరకు పంట పెట్టా. రాత్రి సమయంలో అడవి పం దులు వచ్చి పంటను ధ్వంసం చేయకుండా పంటలో లైట్లను ఏర్పాటు చేశా. వర్షాకాలంలో మరో నాలుగెరాల వరకు పంట పడుతా. రైతులు ఒకేరకమైన పంటను వేయకుండా ప్రభు త్వం సూచిస్తున్న విధంగా ఆయిల్పామ్ను సాగుచేయాలి.
– కుంట నారాయణ, రైతు, మిరుదొడ్డి
రైతుల్లో విస్తృత అవగాహన కల్పిస్తున్నం
నాలుగెకరాలకు పైగా ఉన్న రైతులు ఆయిల్పామ్ సాగు చేయాలని చెబుతున్నాం. 5 వేల ఎకరాలకు ఒక క్లస్టర్ ఏర్పాటు చేసి, సాగుకు అనుకూలంగా ఉన్న రైతులను ఎంపిక చేశాం. ఇప్పటికే గౌరారం, తున్కిఖల్సా క్లస్టర్లలో 44ఎకరాల్లో ఆయిల్పామ్ పంటను సాగు చేస్తున్నారు. మిగతా గ్రామాల్లో ఇదే తరహా రైతులను ప్రోత్సాహిస్తున్నం. ఆయిల్పామ్ సాగుతో కలిగే లాభాలను రైతులకు వివరిస్తున్నాం.
-వెంకటరమణి, వ్యవసాయాధికారిణి, వర్గల్ మండలం
మరో రెండేండ్ల నుంచి ఆదాయం..
ప్రస్తుత పరిస్థితుల్లో ఆయిల్పామ్ సాగు చేస్తే, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందవచ్చు. ప్రభుత్వమే అన్ని రకాల రాయితీలు ఇచ్చి, ప్రోత్సహిస్తున్నది. ఎకరాకు పెట్టుబడి కోసం రైతుబంధుతో పాటు మరో రూ.4200 సాగు ఖర్చులు ఇవ్వడంతో ఎక్కువ మంది రైతులు ముందుకొస్తున్నారు. ఒక్కసారి మొక్కలు నాటి రక్షించుకుంటే నాలుగేండ్ల నుంచి 30 ఏండ్ల దాకా ఆదాయం వస్తూనే ఉంటుంది. నేను 8 ఎకరాల్లో పంట వేసిన. మరో రెండున్నరేండ్లలో ఆదాయం మొదలవుతుంది.
– ఉపేందర్రెడ్డి, రైతు, దౌలాపూర్,జగదేవ్పూర్