జిన్నారం, నవంబర్ 2 : గిరిజన గురుకుల బాలుర పాఠశాలలో 8వ తరగతి విద్యార్థి మెగావత్ శైలేంద్రసింగ్ (14) ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. కుటుంబీకులు, విద్యార్థులు, ప్రిన్సిపాల్ తెలిపిన వివరాల మేరకు.. నర్సాపూర్ దుర్గ్యా తండాకు చెందిన మెగావత్ శైలేంద్రసింగ్ గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. ఐదో తరగతి నుంచి గురుకులంలో చదువుకుంటున్నాడు.
రోజు మాదిరిగానే మంగళవారం రాత్రి 7:30 సమయంలో భోజనం ముగించుకొని తన తరగతి గదిలోనే రాత్రి 9:30 వరకు చదువుకొన్నాడు. నిద్రించేందుకు పాఠశాల పైనే ఉన్న వసతి గదిలోకి విద్యార్థులతో కలిసి వెళ్లాడు. రాత్రి 10 గంటల ప్రాంతంలో వాచ్మెన్ నర్సింహులు తరగతి గదుల్లో వెలిగే లైట్లను బంద్ చేస్తూ వస్తున్నాడు. 8వ తరగతి గదిలోని లైటును బంద్ చేసేందుకు రాగా, సీలింగ్కు ఉరి వేసుకున్న శైలేంద్రసింగ్ను చూశాడు. వెంటనే ప్రిన్సిపాల్ సాంబ్యనాయక్ గదికి వెళ్లి విషయం చెప్పాడు. సాంబ్యనాయక్, పాఠశాల ఉపాధ్యాయ సిబ్బందితో కలిసి వచ్చి పరిశీలించారు.
వెంటనే ఆర్సీవో కల్యాణికి ఆ తర్వాత విద్యార్థి తండ్రి తారాసింగ్, తహసీల్దార్ దశరథ్సింగ్, సర్పంచ్ లావణ్యనరేశ్, ఎంపీటీసీ వెంకటేశంగౌడ్, ఎస్సై సిద్ధిరాములుకు ఫోన్లో సమాచారం ఇచ్చారు. విద్యార్థి తండ్రి తారాసింగ్, తల్లి స్వరూప, కుటుంబీకులు, బంధువులు పాఠశాలకు వచ్చారు. విద్యార్థి వివరాలు ఎస్సై ప్రిన్సిపాల్ నుంచి తీసుకుంటున్న సమయంలోనే ఆగ్రహించిన కుటుంబీకులు, బంధువులు ప్రిన్సిపాల్ సాంబ్యనాయక్పై దాడి చేశారు.
విద్యార్థి మృతికి ప్రిన్సిపాల్, సిబ్బంది కారణమని ఆరోపించారు. మృతి చెందిన విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని, కుటుంబీకుల్లో ఒకరికి గురుకుల అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంత్యక్రియలకు పాఠశాల స్టాఫ్ రూ.30వేలు, పాఠశాల అకౌంట్ నుంచి రూ.20వేలు అందజేశారు. శైలేంద్రసింగ్కు అనారోగ్యం కారణంగా ఇటీవల ఆపరేషన్ కూడా అయ్యిందని, అయినా సమస్య తగ్గక ఇబ్బందులు పడుతున్నట్లు తెలిసింది. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.