ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుతున్నాయి. సర్కారు బడుల్లో సకల సౌకర్యాలు కల్పించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కంకణం కట్టుకున్నారు. అందులో భాగంగా ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టగా.. మిరుదొడ్డి బాలుర జడ్పీ పాఠశాల ఎంపికైంది. ప్రభుత్వం రూ. 22.66 లక్షలు మంజూరు చేసింది. పాఠశాలలో పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. 50 శాతం పనులు పూర్తయినట్లు అధికారులు తెలిపారు. దీంతో సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డికి ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
మిరుదొడ్డి, అక్టోబర్ 23 : సర్కారు బడుల్లో విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించి, ఆహ్లాదకర వాతావరణంలో నాణ్యమైన విద్యనందించాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యం. లక్ష్యానికి అనుగుణంగా సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ‘మన ఊరు-బడి’లో మిరుదొడ్డి బాలుర జడ్పీ పాఠశాల కొత్త శోభను సంతరించుకోనున్నది.ప్రభుత్వం ‘మనఊరు-మనబడి’లో మండలంలోని 14 పాఠశాలలను ఎంపిక చేసింది. మిరుదొడ్డి బాలుర జడ్పీ పాఠశాలకు ‘మనఊరు-మనబడి’ పథకంలో ఎంపికైంది. ఈ పాఠశాలలో 205 మంది విద్యార్థులకు విద్యనభ్యసిస్తున్నారు. 11 మంది ఉపాధ్యాయులు విద్యాబోధన చేస్తున్నారు. పాఠశాలలో 15 తరగతి గదులు ఉండగా, నెలకొన్న సమస్యలు మేజర్, మైనర్ పనులు, తరగతి గదులకు నూతన డోర్లు బిగించడం, నూతన డైనింగ్ హాల్ నిర్మాణానికి ప్రభుత్వం నిధులను మంజూరు చేసింది.
బాలుర జడ్పీ పాఠశాలకు ప్రభుత్వం రూ.22.66లక్షలు నిధులు మంజూరు చేసింది. పాఠశాలలో పనులు జోరుగా కొనసాగుతున్నాయి. తరగతి గదుల్లో ట్యూబ్ లైట్లు, ఫ్యాన్లు బిగించగా, విద్యుత్ పరికరాలను పూర్తిగా ఫిటింగ్ చేశారు. పాఠశాల బిల్డింగ్కు మైనర్ పనులు పూర్తిచేశారు. పాఠశాలకు గదుల్లోకి ముందుగా ఎక్కే రోపును నిర్మాణం చేశారు. డైనింగ్ హాల్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు పాఠశాలలో రూ.5 లక్షల నిధులతో వివిధ రకాల పనులు పూర్తయ్యాయి.
సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతున్న
పాఠశాలలోని తరగతి గదులకు డోర్లు, కిటికీలు, ప్రహరీ, రూ.12 లక్షల నిధులతో నిర్మిస్తున్న డైనింగ్ హాల్ పనులు పూర్తి కావాల్సి ఉంది. పాఠశాలను సకల హంగులతో తీర్చి దిద్దాడానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో విద్యార్థులు, పోషకులు, గ్రామస్తులు సంతోషంగా వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్, ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు, జిల్లా అధ్యక్షుడు, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
గత ప్రభుత్వాలు పాఠశాలల అభివృద్ధికి నిధులు వెచ్చించలేదు. సీఎం కేసీఆర్ విద్యార్థులకు ఆహ్లాదకర వాతావరణంలో విద్యనందించడానికి ప్రత్యేక దృష్టి సారించడం సంతోషంగా ఉంది. సీఎం కేసీఆర్ సార్ లక్ష్యానికి అనుగుణంగా విద్యాన్థులకు నాణ్యమైన బోధన అందించడానికి కృషి చేస్తాం.
-కొత్త రాజిరెడ్డి, ప్రధానోపాధ్యాయుడు, బాలుర జడ్పీ పాఠశాల, మిరుదొడ్డి
సీఎం కేసీఆర్ సార్ పేద విద్యార్థులు బాగా చదుకోవాలని ఎంతో కష్టపడుతున్నారు. సార్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఉపాధ్యాయులు చెప్పిన పాఠ్యాంశాలను శ్రద్ధగా విని పదో తరగతి ఫలితాల్లో 10 జీపీఏ సాధిస్తా.
-ఎ.రేవతి, విద్యార్థి, 10వ తరగతి, జడ్పీ పాఠశాల మిరుదొడ్డి