సిద్దిపేట, సెప్టెంబర్ 17 : సిద్దిపేట మెడికల్ కాలేజీ విద్యార్థులు స్థానికంగా ఏర్పాటు చేసిన మెడ్ ఎక్స్పో-2022 ఆకట్టుకుంటున్నది. మొదటి రోజు 3వేల మంది ప్రదర్శననను తిలకించారు. రెండో రోజు శనివారం 4500మంది విద్యార్థులు సందర్శించారు. మారుతున్న జీవన శైలికి అనుగుణంగా ముం దుకు సాగాల్సిన వైనంపై విద్యార్థులు తమ ప్రదర్శనల ద్వారా కండ్లకు కట్టినట్టుగా చూపారు. ప్రజా ఆరోగ్య పరిరక్షణకు కోసం ప్రజల్లో చైతన్యం తీసుకురావడం. సమాజంలో జరుగుతున్న మార్పులు. వైద్యవిద్య ప్రాధాన్యత.. పరిసరాల పరిశుభ్రత.. గృహ హింస.. యుక్త వయస్సులో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు.. నేడు సమాజంలో సాధారణంగా మారిన డయాబెటిస్, బీపీ తదితర వ్యాధులకు ఎలా చెక్ పెట్టాలి.. ప్రథమ చికిత్స నిర్వహించడం ఎలా? మానవ శరీరంలో ఉన్న ఆవయవాలు.. వాటి పనితీరు.. ఆధునిక సమాజంలో మనిషి ఎదుర్కొంటున్న మానసిక సమస్యలు.. ఆత్మహత్యలు.. ఇలా ప్రతి అంశంపై వైద్య కళాశాలకు చెందిన విద్యార్థులు వివరించారు. ఈ ఎక్స్పోలో మొత్తం 80 స్టాళ్లను ఏర్పాటు చేశారు. 350మంది విద్యార్థుల భాగస్వామ్యంతో 19 విభాగాలకు చెందిన వైద్య ప్రదర్శనలను పెట్టారు. కాగా, ఎక్స్పోను మొదట రెండు రోజులే నిర్వహించాలని ఆర్గనైజర్స్ భావించగా, ప్రదర్శనకు అనూహ్య వస్తుండడంతో మరో రోజు పొడిగించారు. నేటితో ప్రదర్శన ముగియనున్నది.
ప్రజల్లో వైద్యంపై చైతన్యం తేవడమే లక్ష్యం
వైద్యంపై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు ఈ ఈవెంట్ నిర్వహించారు. ప్రజలు ఎదుర్కొంటున్న వ్యాధులు, అవి రావడానికి గల కారణాలు.. తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలను ఇందులో వివరించాం. మమ్మల్ని ప్రోత్సహించిన మంత్రి హరీశ్రావు సార్కు, మా ఆలోచనలకు కార్యరూపం ఇచ్చిన కాలేజీ ప్రిన్సిపాల్కు ధన్యవాదాలు.
– సత్యచరణ్, వైద్య విద్యార్థి, మిడ్ ఎక్స్పో ఆర్గనైజర్
వైద్యవిద్యపై ఆసక్తి కల్పించేందుకు..
విద్యార్థులకు వైద్యవిద్యపై ఆసక్తి కల్పించేందుకు ఎక్స్పో ఏర్పాటు చేశాం. మొత్తం 80 స్టాళ్లను పెట్టాం. ఇక్కడ మానవ శరీరం పనితీరు.. వ్యాధులకు కారణాలు,ప్రజల ఆరోగ్య పరిరక్షణలో ప్రకృతి పాత్ర, ఆరోగ్యకర జీవనానికి తీసుకోవాల్సిన జాగత్త్రలు.. ఆహారపు నియమాలు.. ఇలా ప్రతి అంశంపై ప్రదర్శనలు నిర్వహించాం.. మాకు సహకారం అందించిన కళాశాల డైరెక్టర్ మేడం, అధ్యాపకులకు ధన్యవాదాలు.
– హర్షిత, వైద్య విద్యార్థి, మిడ్ ఎక్స్పో ఆర్గనైజర్