సుల్తాన్బజార్,డిసెంబర్ 29 : ప్రభుత్వ దవాఖానలలో పేదలకు కార్పొరేట్ వైద్యం అందజేయాలనే కృతనిశ్చయంతో తెలంగాణ ప్రభుత్వం ఉందని రాష్ట్ర వైద్య, విద్య సంచాలకులు డాక్టర్ రమేశ్రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సంస్థ సీఎస్ఆర్లో భాగంగా అత్యాధునిక వైద్య పరికరాలను అందజేశారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన ఉస్మానియా మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శశికళారెడ్డి, దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ బి నాగేందర్, అడిషనల్ సూపరింటెండెంట్ డాక్టర్ త్రివేణి, మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ విభాగాధిపతి డాక్టర్ రమేశ్కుమార్, డీవీఎల్ విభాగాధిపతి డాక్టర్ వెంకటక్రిష్ణతో పాటు వివిధ విభాగాల అధిపతులు, ఆర్ఎంవోలతో కలిసి 65 లక్షల విలువ చేసే హెచ్ఆర్ మ్యానోమెట్రీ, లేజర్స్, హోల్బాడీ పువా యంత్రాలను ఆయన ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ఉస్మానియా దవాఖానలో అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక యంత్రాలతో కార్పొరేట్లో 50 లక్షల వరకు ఖర్చయ్యే వైద్య చికిత్సలను పేదలకు ఉచితంగా అందిస్తారని అన్నారు. ఉస్మానియా దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ బి. నాగేందర్ మాట్లాడుతూ సీఎస్ఆర్ నిధుల కింద ఉస్మానియాకు అత్యాధునిక వైద్య పరకరాలను అందజేస్తున్న పవర్ గ్రిడ్ కార్పొరేషన్ సంస్థ ప్రతినిధులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉస్మానియా దవాఖాన సీఎస్ ఆర్ఎంవో-1 డాక్టర్ బి శేషాద్రి, ప్లాస్టిక్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ నాగప్రసాద్, న్యూరో విభాగాధిపతి డాక్టర్ శ్రీరంగ లక్ష్మి, డిప్యూటీ సీఎస్ ఆర్ఎంవోలు డాక్టర్ సాయిశోభ, డాక్టర్ బండారి శ్రీనివాసులు, సీఏఎస్ ఆర్ఎంవోలు డాక్టర్ సిద్దిఖీ, డాక్టర్ మాధవి, డాక్టర్ రఫీ, డాక్టర్ కవిత, నర్సింగ్ సూపరింటెండెంట్ సుజాత తదితరులు పాల్గొన్నారు.
బొల్లి మచ్చలను తొలిగించేందుకు…
ప్రతి ఒక్కరూ అందంగా కనిపించాలని ఎంతైనా ఖర్చు చేస్తారు. శరీరంపై మచ్చలను తొలిగించేందుకు ప్రైవేట్, కార్పొరేట్ దవాఖానలు రూ.50 లక్షల వరకు వసూలు చేస్తారు. ఉస్మానియా డీవీఎల్ విభాగంలో లేజర్స్ ట్రీట్మెంట్తో మచ్చలను ఉచితంగా తొలగిస్తారు.
హెచ్ఆర్ మానోమెట్రీ యంత్రంతో..
ప్రతి మనిషికి రెండు నవటలు ఉంటాయని, ఆహారం తినగానే ఒక నవట దాటగానే ఆటోమేటిక్గా రెండో నవట తెరుచుకోవాలి. అప్పుడే గొంతులో నుంచి ఆహారం లోపలికి వెళుతుంది. అలా వెళ్లకపోతే ఆహారం గొంతులోనే ఇరుక్కుని తీవ్ర ఇబ్బంది పడుతారు. ఇటువంటి ఇబ్బందులు అత్యధికంగా 25 నుంచి 30 ఏండ్ల మధ్య వయసున్న అమ్మాయిలలోనే అత్యధికంగా వస్తాయి. ఈ సమస్యలను గుర్తించడానికి మెడికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగంలో హెచ్ఆర్ మానోమెట్రీ యంత్రం ఎంతగానో దోహదం చేస్తుంది.