చేర్యాల, జనవరి 21: సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలోని మల్లికార్జున స్వామి క్షేత్రం బ్రహ్మోత్సవాలకు సిద్ధమైంది. ఆలయ ఆచార, సంప్రదాయాల ప్రకారం సంక్రాంతి తర్వాత వచ్చే మొదటి ఆదివారంతో స్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ ఉత్సవాల్లో స్వామి వారి కల్యాణం, పట్నం వారం, లష్కర్వారం, మహా శివరాత్రి రోజున నిర్వహించే పెద్దపట్నం, అగ్నిగుండాల కార్యక్రమాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఉత్సవాలను పురస్కరించుకొని ఆలయవర్గాలు ఆలయం, రాజగోపురం, గదులకు రంగులు వేయించి సుందరంగా ముస్తాబు చేశారు. ఈనెల 22న నిర్వహించే పట్నం వారంతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. బ్రహ్మోత్సవాల సమయంలో తొమ్మిది ఆదివారాలతో పాటు ప్రత్యేక కార్యక్రమాలకు భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తారు. భక్తుల సౌకర్యార్ధం ఆలయవర్గాలు ఈ సంవత్సరం ప్రత్యేకంగా క్యూలైన్లలో తాగునీటి వసతి కల్పిస్తున్నారు. భక్తులకు విశిష్ట దర్శనం, శ్రీఘ్రదర్శనం, ధర్మ దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈనెల 23న స్వామి వారి కల్యాణ వేదిక వద్ద వైభవంగా పెద్దపట్నం, అగ్నిగుండాల కార్యక్రమాన్ని ఆలయవర్గాలు నిర్వహించనున్నాయి. ఆలయ సంప్రదాయం మేరకు హైదరాబాద్ ఒగ్గు పూజారుల ఆధ్వర్యంలో ఆలయవర్గాల పర్యవేక్షణలో వీటిని నిర్వహిస్తారు. పట్నం వారానికి తరలివచ్చిన భక్తులు పెద్దపట్నం, అగ్నిగుండం కార్యక్రమాల్లో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్న ఆనంతరం కొండపోచమ్మ, నల్లపోచమ్మ ఆలయాలకు వెళ్లి అక్కడ బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు.
హైదరాబాద్ భక్తులు పాల్గొంటారు కాబట్టి పట్నం వారం అంటారు. పట్నం సందర్భంగా ఆదివారం అధిక సంఖ్యలో హైదరాబాద్కు చెందిన భక్తులు మల్లన్నను దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు. హైదరాబాద్ భక్తులు మల్లన్న పేరిట సట్టీ దీక్షలను 41 రోజుల పాటు భక్తిశ్రద్ధలతో చేపడతారు. పట్నం వారం స్వామి వారిని దర్శించుకున్న అనంతరం ఆ దీక్షలు విరమిస్తారు. స్వామి వారితో పాటు పట్నం వేసి గుట్టపై ఉన్న ఎల్లమ్మ తల్లికి బోనం సమర్పిస్తారు. పట్నం వారానికి 50వేలకు పైగా భక్తులు రానున్న నేపథ్యంలో ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అదనపు డీసీపీ మహేందర్ ఆధ్వర్యంలో హుస్నాబాద్ ఏసీపీ సతీశ్, చేర్యాల సీఐ శ్రీనివాస్రెడ్డి, కొమురవెల్లి ఎస్సై చంద్రమోహన్ పర్యవేక్షణలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.