పటాన్చెరు, ఏప్రిల్ 15: ఐదు వందల టన్నుల రేషన్ బియాన్ని సంగారెడ్డి జిల్లా టాస్క్ఫోర్స్, సివిల్ సప్లయ్ అధికారులు రైస్మిల్పై దాడి చేసి పట్టుకున్నారు. దాదాపు రూ.2.15 కోట్ల విలువైన బియ్యం, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. సోమవారం పటాన్చెరు మండలం పాశమైలారం పారిశ్రామికవాడలో ఏర్పాటు చేసిన సమావేశంలో సంగారెడ్డి జిల్లా ఎస్పీ రూపేశ్ మాట్లాడారు. పాశమైలారంలోని ఒక షెడ్ను లీజుకు తీసుకుని నిజామాబాద్, బోధన్కు చెందిన ప్రభాకర్రెడ్డి రైస్మిల్ ఏర్పాటు చేశాడు. రవి అనే వ్యక్తితో రైస్మిల్ను నడిపిస్తున్నాడు. ప్రజల వద్ద తక్కువ ధరకు కొనుగోలు చేసున్న బియాన్ని రైస్మిల్లులో పాలిష్ చేసి గన్నీ బ్యాగుల్లో నింపి ఎఫ్సీఐ మార్క్ ముద్రించి, లారీల్లో లోడ్ చేసిన అనంతరం బోధన్లోని రైస్ మిల్లులకు ఫోన్లో సమాచారం ఇచ్చి, లారీ నెంబర్తో ఎఫ్సీఐ వే బిల్లులను వినాయక ట్రైడర్స్ రాంపూర్, ఆదిలాబాద్ పేరు మీద తెలంగాణ రాష్ట్ర సివిల్ సప్లయ్ గోదాం, ఇచ్చోడా ఆదిలాబాద్కు వెళ్తున్నట్లుగా తయారుచేసి రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు తరలిస్తున్నారు.
ప్రభుత్వం నుంచి ప్రజలకు పంపిణీ చేయాల్సిన పీడీఎస్ రైస్ను అక్రమంగా కొనుగోలు చేసి ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతూ ఎఫ్సీఐ రైస్తో కలిసి అమ్ముతున్న దాదాపు 500 టన్నుల పీడీఎస్ రైస్ను పాశమైలారం మిల్లో పోలీసులు స్వాధీనం చేసుకున్నారని ఎస్పీ తెలిపారు. ప్రభుత్వానికి రైస్మిల్స్ లెక్కప్రకారం ఇవ్వాల్సిన బియ్యం ఇవ్వకుండా ఇలా పాలిష్ చేసిన బియాన్ని మోసంతో అందజేస్తున్నారని తెలిపారు. ఈ దాడి సమయంలో నిందితుడు ప్రభాకర్రెడ్డి పరారయ్యాడని చెప్పారు. 500 టన్నుల బియ్యాన్ని అధికారులు పట్టుకుని సివిల్ సప్లయ్ అధికారులకు అందజేశారు. బియ్యాన్ని తీసుకొచ్చిన 3 లారీలు, 4 డీసీఎంలను సీజ్ చేశారు. రవిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశామని ఎస్పీ రూపేశ్ వివరించారు. దాడిలో పాల్గొన్న పోలీసు, సివిల్ సైప్లె అధికారులను సీసీఎస్ ఇన్స్పెక్టర్ కిశోర్, ఇన్స్పెక్టర్ శేఖర్, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. సమావేశంలో సివిల్ సప్లయ్ ఎస్పీ శశిధర్రాజు, అదనపు ఎస్పీ సంజీవరావు, డీఎస్పీ రవీందర్రెడ్డి, బీడీఎల్ సీఐ రవీందర్రెడ్డి, సివిల్ సప్లయ్ అధికారి వనజాతారెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ తదితరులు పాల్గొన్నారు.