సిద్దిపేట,జూన్ 25: సిద్దిపేట నియోజకవర్గం అన్నింటిలో ఆదర్శంగా నిలిచిందని, అదే స్థాయిలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో (ఎస్ఐఆర్) ముందుండాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు పిలుపునిచ్చారు. గురువారం సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బీఆర్ఎస్ నాయకులతో ఎస్ఐఆర్పై సమావేశమయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) రాష్ట్రంలో ఇప్పటి వరకు ఫ్యామిలీ మ్యాపింగ్ పూర్తయ్యిందన్నారు. గురువారం డోర్ టూ డోర్ వెళ్లి ఓటు నమోదు చేసే కార్యక్రమం జరుగుతుందన్నారు.
సిద్దిపేట నియోజకవర్గంలో ఇప్పటి వరకు 70శాతం అయ్యిందని, టౌన్లో 69 శాతం, రూరల్ మండలాల్లో 90శాతం అయ్యిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒకరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. బూత్ లెవల్ ఏజెంట్స్ క్రియాశీలంగా పని చేయాలన్నారు. ప్రజలు పాల్గొనేలా పార్టీ నాయకులు, కార్యకర్తలు పని చేయాలని, ఎన్యూమరేషన్ ఫామ్ నింపే ప్రక్రియలో ప్రజలకు అందుబాటులో ఉండి సహకరించాలని కోరారు. బూత్ లెవల్ ఏజెంట్స్ ప్రతి ఓటరుని కాలవాలని, ప్రతి గడపనూ తట్టాలన్నారు. బూత్ లెవల్ ఏజెంట్స్ అధికారులతో సమన్వయం చేసుకోవాలని,కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, కేసీఆర్ అభిమానులు భాగస్వాములను చేయాలన్నారు.
ఈ ప్రక్రియ రెండు నెలల పాటు ఉంటుందని, 18 ఏండ్లు నిండిన వారు ఓటు నమోదు చేసుకొనే విధంగా అవగాహన కల్పించాలన్నారు. అక్టోబర్ 1 తేదీ వరకు ఫైనల్ ఓటర్ జాబితా వస్తుందని, అప్పటిలోగా డబుల్ ఓట్లు లేకుండా, మార్పులు చేర్పులు చేసే విధంగా ఎప్పటికప్పుడు చూడాలన్నారు. ఈ కార్యక్రమంపై సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో హెల్ప్ డెస్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. కలెక్టరేట్లోఎస్ఐఆర్ పై సందేహాలు నివృత్తి చేసేందుకు లిఖిత అనే ప్రభుత్వ అధికారిని నియమించారన్నారు. బూత్ లెవల్ ఏజెంట్స్ క్రియాశీలంగా పాల్గొని అంగన్వాడీ, ఆర్పీలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.