పటాన్చెరు, మార్చి 21: ’చె’త్తశుద్ధేదీ..? శీర్షికన ‘నమస్తే తెలంగాణ’లో గురువారం ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. పటాన్చెరు మండలంలోని మేజర్ పంచాయతీల్లో సేకరిస్తున్న తడి, పొడి చెత్తను డంప్యార్డుల్లో తగులబెడుతున్నారని వచ్చిన కథనంపై మండల పంచాయతీ అధికారి హరిశంకర్గౌడ్ స్పందించి పంచాయతీలకు ఆదేశాలు ఇచ్చారు. ఆయన ఆదేశాల మేరకు గురువారం ఇస్నాపూర్ డంప్యార్డులో కార్యదర్శి మధుసూదన్రెడ్డి ఆధ్వర్యంలో చెత్తను జేసీబీలు, ట్రాక్టర్లు ఉపయోగించి ఎత్తివేశారు. చెత్తను కాల్చవద్దని పారిశుధ్య సిబ్బందికి ఆదేశించారు.
డంప్యార్డును శుభ్రంగా తయారు చేశారు. ఈ సందర్భంగా ఎంపీవో హరిశంకర్గౌడ్ మాట్లాడుతూ.. చెత్తను తగులబెట్టరాదని పంచాయతీలకు ఆదేశాలు ఇచ్చామన్నారు. పంచాయతీలు తమ వద్ద ఉన్న చెత్తతో సేంద్రియ ఎరువులను తయారు చేసుకోవాలని సూచించినట్లు తెలిపారు. మేజర్ పంచాయతీల్లో ఉత్పత్తి అవుతున్న చెత్తను పునర్వినియోగం చేయడంపై చర్చించి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. పక్కా ప్రణాళికతో గ్రామాలను చెత్త రహితంగా తయారు చేస్తామని మండల పంచాయతీ అధికారి హరిశంకర్గౌడ్ తెలిపారు.