సంగారెడ్డి కలెక్టరేట్, డిసెంబర్ 17: నిత్యం పుస్తకాలతో బిజీబిజీగా ఉండే విద్యార్థినులు సరదాగా తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. వారికి వచ్చిన వంటలు చేయడంతోపాటు వివిధ హస్తకళలను ప్రదర్శించారు. ప్రతి సంవత్సరం నిర్వహించే విపణి (సంత) కార్యక్రమాన్ని శనివారం స్థానిక ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఘనంగా నిర్వహించారు. సంగారెడ్డి అదనపు కలెక్టర్ రాజర్షి షా ముఖ్యఅతిథిగా హాజరై ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు తయారు చేసిన వివిధ హస్తకళలను తిలకించి వారిని అభినందించారు. వారు తయారు చేసిన ఆయా ఆహార పదార్థాలను రుచి చూసిన అదనపు కలెక్టర్ విద్యార్థినుల నైపుణ్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థినులు చదువులతోపాటు తమ ఉన్న నైపుణ్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కళాశాలలో నిర్వహించిన విపణి కార్యక్రమం చాలా బాగున్నదని కితాబిచ్చారు.
కళాశాలలో ఏర్పాటు చేసిన విపణిలో భాగంగా విద్యార్థినుల స్టాళ్లు అందరినీ ఆకట్టుకున్నాయి. జొన్న రొట్టెలు, పోలెలు, బిర్యానీ, మిరపకాయ బజ్జీలు, పానీ పూరి, సున్నుండలు, బెల్లం పట్టీలు వంటి అనేక ఆహార పదార్థాలతో పాటు జ్యూట్ బ్యాగులు వంటి హస్తకళలను విద్యార్థినులు ప్రదర్శించారు. విద్యార్థులు నిర్వహించిన ఆయా ఆటల పోటీల్లో పాల్గొని సందడి చేశారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. కార్యక్రమంలో యువజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ వేణుగోపాల కృష్ణ, కళాశాల ప్రిన్సిపాల్ హ్యూమేరా సయీద్, అధ్యాపకులు, వివిధ కళాశాలలు, పాఠశాలల విద్యార్థులు, పరిసర ప్రాంతాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.