డబుల్ బెడ్రూం ఇండ్లు దేశానికే రోల్మోడల్
ఆధునిక హంగులు, అన్ని సౌకర్యాలు కల్పించిన ప్రభుత్వం
హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి
కొల్లూర్ డబుల్ బెడ్రూం ఇండ్ల పరిశీలన
రామచంద్రాపురం, ఫిబ్రవరి 8: కొల్లూర్ డబుల్ బెడ్రూం ఇండ్లు దేశానికే రోల్ మోడల్గా నిలువనున్నాయని హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి అన్నారు. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపలిటీ పరిధిలోని కొల్లూర్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల టౌన్షిప్ని మంగళవారం మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలతారెడ్డితో కలిసి పరిశీలించారు. డబుల్ బెడ్రూం ఇండ్ల ప్రాజెక్టులో కలియతిరిగి ఇండ్ల నిర్మాణాలు, రోడ్లు, డ్రైనేజీ, వాటర్ సంపులు, ఎస్టీపీ ప్లాంట్, షాపింగ్ కాంప్లెక్స్, పార్కు స్థలాలు, గ్రౌండ్, ప్లాంటేషన్, లిఫ్ట్, ట్రాన్స్ఫార్మర్ తదితర సౌకర్యాలను ఆమె పరిశీలించారు. ప్రాజెక్ట్ నిర్మాణ విషయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. లిఫ్ట్లో బిల్డింగ్పైకి వెళ్లి అక్కడి నుంచి పూర్తి ప్రాజెక్టును పరిశీలించారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ కొల్లూర్ డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలు అద్భుతంగా ఉన్నాయన్నారు. పేదలు తలెత్తుకొని, సగౌరవంగా బతకాలనే ఉద్దేశంతో అధునాతన టెక్నాలజీతో ప్రభుత్వం ఇండ్ల నిర్మాణం చేపట్టిందన్నారు. దేశంలో ఎక్కడా కూడా ఇంతపెద్ద ప్రాజెక్ట్ లేదన్నారు. ఒకే చోట లక్ష జనాభా ఆవాసం ఉండేలా ఈ ప్రాజెక్టు రూపకల్పన జరిగిందన్నారు. రూ.1432.50 కోట్లతో 145 ఎకరాల విస్తీర్ణంలో, 15,660 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. మొత్తం ప్రాజెక్టులో 117 బ్లాక్లను ఏర్పాటు చేసి, ఒక్కో బ్లాక్కు రెండు లిఫ్ట్లు, ట్రాన్స్ఫార్మర్, జనరేటర్లు, ఫైర్ సేప్టీని కల్పించినట్లు తెలిపారు.
కొల్లూర్ ప్రాజెక్టు నిర్మాణాలను మొదటిసారి పరిశీలించానని, ప్రాజెక్ట్లో ఇండ్లు, విశాలమైన రోడ్లు, ప్లాంటేషన్, అండర్ కేబుల్స్ సిస్టం, వాకింగ్ట్రాక్ తదితర మౌలిక సౌకర్యాలు బాగున్నాయన్నారు. సీఎం కేసీఆర్ దార్శనికతకు కొల్లూర్ డబుల్ బెడ్రూం ఇండ్లు నిదర్శనంగా నిలుస్తాయని తెలిపారు. తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూర్-1లో 2052, ఈదులనాగులపల్లిలో 1944 డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించినట్లు తెలిపారు. కొల్లూర్ ప్రాంతం చుట్టుపక్కల ఎన్నో వెంచర్లు, అపార్ట్మెంట్లు వచ్చాయని, ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతోందని, ఇలాంటి విలువైన ప్రాంతంలో పేదల కోసం ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్లను కట్టించి ఇచ్చిందన్నారు. మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలను పరిశీలినట్లు మేయర్ తెలిపారు. అంతకుముందు ప్రాజెక్టుకు సంబంధించిన నమూనాను ఆమె పరిశీలించారు. ఆమెవెంట అధికారులు తదితరులు ఉన్నారు.