రామాయంపేట, ఫిబ్రవరి 25 : క్రీడల పట్ల విద్యార్థులు ఆసక్తి కనబర్చాలని మెదక్ జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి నాగరాజు అన్నారు. కలెక్టర్ రాజర్షి షా ఆదేశాల మేరకు ఆదివారం రామాయంపేట గజ్వేల్ రోడ్డులో ఖేలో ఇండియా ఆధ్వర్యంలో 80 మంది విద్యార్థులతో జిల్లా స్థాయి సైక్లింగ్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అండర్-14, అండర్-17 పోటీలకు జిల్లా నుంచి 80 మంది హాజరయ్యారన్నారు.
జాతీయ సైక్లింగ్ అవార్డు గ్రహీత, పీఈటీ దండు యాదగిరి నేతృత్వం లో యువతకు సైక్లింగ్లో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఇక్కడ శిక్షణ పొందిన క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రతిభ చాటి అవార్డులు సాధించాలని ఆకాంక్షించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని సూచించారు. తమ పిల్లలు క్రీడల పట్ల ఆసక్తి కనబర్చేలా తల్లితండ్రులు ప్రోత్సహించాలని, అప్పుడే వారు పైస్థాయికి ఎదుగుతారని తెలిపారు. కార్యక్రమంలో ధ్యాన్చంద్ పీఈటీల సంఘం సభ్యులు శ్రీనివాస్, సైక్లింగ్ కోచ్ దండు యాదగిరి పాల్గొన్నారు.