నర్సాపూర్, ఫిబ్రవరి 24: తెలంగాణ ప్రభుత్వం పేదల సంక్షేమానికి కృషి చేస్తున్నదని, ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నారు. శుక్రవారం నర్సాపూర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వారు 58 జీవో కింద దరఖాస్తు చేసుకున్న 65 మంది లబ్ధిదారులకు సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ స్థలంలో ఇల్లు నిర్మించుకుని పట్టా లేకుండా భయంతో బతుకుతున్న వారందరికీ భరోసా కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికీ ఉచితంగా 58 జీవో కింద సర్టిఫికెట్లను పంపిణీ చేస్తుందని తెలిపారు.
ఇండ్లు లేని అర్హులైన ప్రతి ఒక్కరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో అవకాశం కల్పిస్తామని తెలిపారు. నర్సాపూర్ పట్టణం దినదినాభివృద్ధి చెందుతూ ఎన్నో కాలనీలు విస్తరించాయని, ప్రస్తుతం ఇచ్చిన సర్టిఫికెట్లతో ఇండ్లు మరొకరికి అమ్మకుండా ఉండాలని సూచించారు. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో ఎంతో పేదలకు లబ్ధి చేకూరుతున్నదన్నారు. త్వరలో 59 జీవో కింద సైతం సర్టిఫికెట్లను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నయీం, కౌన్సిలర్ అశోక్గౌడ్, రామచందర్, మున్సిపల్ కమిషనర్ వెంకటగోపాల్, తహసీల్దార్ ఆంజనేయులు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు చంద్రశేఖర్, పట్టణాధ్యక్షుడు భిక్షపతి, నాయకులు హబీబ్ ఖాన్, ఆంజనేయులుగౌడ్, సత్యంగౌడ్, జ్ఞానేశ్వర్, సాగర్ తదితరులు పాల్గొన్నారు.