ఝరాసంగం, డిసెంబర్ 23: ఝరాసంగం మండలంలోని ప్రకృతి రమణీయత ప్రశాంతతకు నిలయమైన బర్దీపూర్ దత్తగిరి మహారాజ్ ఆశ్రమంలో మార్గశిర పౌర్ణమి 26న దత్త జయంతిని వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆశ్రమ పీఠాధిపతి 108 వైరాగ్య శిఖామణి అవధూత గిరిమహారాజ్, డాక్టర్ సిద్దేశ్వర స్వామి ఆధ్వర్యంలో ఈ నెల 24 నుంచి మూడు రోజుల పాటు 21 యజ్ఞ గుండాలతో దత్త యజ్ఞాలు, లోక కల్యాణార్థం, చండీ హోమం నిర్వహిస్తున్నట్లు ఆశ్రమ పీఠధిపతులు పేర్కొన్నారు. ఉత్సవాల్లో పాల్గొనేందుకు తెలుగు రాష్ర్టాల నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ర్టాల నుంచి కూడా భక్తులు తరలిరానున్నారు. భక్తుల సౌకర్యార్థం ఆశ్రమ ఆవరణలో చలువ పందిళ్లు, తాగునీరు, భోజన వసతి కల్పించేందుకు దత్తగిరి మహారాజ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. ఆశ్రమ ముఖద్వారంతోపాటు దత్తాత్రేయుడు, మహర్షి అనసూయమాత, జ్యోతిర్లింగాలు, పంచవృక్షాలు, రేణుకామాత, నవగ్రహాల ఆలయాలను అలంకరించారు. ఆశ్రమం ఎదుట రోడ్డుకు ఇరువైపులా దుకాణాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
దత్త జయంతికి జహీరాబాద్ నుంచి బర్దీపూర్ ఆశ్రమానికి భక్తుల సౌకర్యార్ధం ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు నడపనున్నారు. అవాంఛనీయ ఘటనలు జరుగకుండా జహీరాబాద్ డీఎస్పీ రఘు, స్థానిక ఎస్ఐ రాజేందర్రెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తు, మండల వైద్యాధికారి ఆధ్వర్యంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయనున్నారు.