సంగారెడ్డి కలెక్టరేట్, జూలై 4: ఆయిల్పామ్ సాగును ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్జాజు సంగారెడ్డి కలెక్టర్కు సూచించారు. శనివారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. వ్యవసాయం, విత్తనాలు, ఎరువుల లభ్యత, ప్రజారోగ్యం, ఫార్మర్ రిజిస్ట్రేషన్, తాగునీటి సరఫరా, ఇరిగేషన్, విద్య, వాతావరణంలో మార్పులు, ఉద్యానవనం, సూక్ష్మ సాగునీరు, ఆయిల్పామ్ విస్తరణ, మధ్యాహ్న భోజనంపై కలెక్టర్, సంబంధిత అధికారులతో సమీక్షించారు. ముఖ్యంగా వానకాలం ప్రారంభమైనందున జిల్లాలో సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని ఫ్లాగ్షిప్ కార్యక్రమాలను జిల్లాలో విజయవంతంగా అమలు చేయాలన్నారు.
సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ జిల్లాలో విత్తనాలు, ఎరువులకు ఎలాంటి కొరత లేదన్నారు. రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచుతున్నామని సీఎస్కు వివరించారు. ప్రత్యామ్నాయ పంటల సాగు, ప్రభుత్వం ప్రతిపాదించిన సన్నరకం వరి సాగుపై రైతులకు అవగాహన కల్పిస్తూ ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. ఫార్మర్ రిజిస్ట్రేషన్ అమలు చేస్తూ 100 శాతం నమోదు పూర్తి చేసేవిధంగా చర్యలు చేపట్టామన్నారు. సింగూర్ ప్రాజెక్టుకు సంబంధించిన మరమ్మతులు కొనసాగుతున్నాయని, త్వరగా పనులు పూర్తయ్యేలా చూస్తామన్నారు. జిల్లాలో సీజనల్ వ్యాధులు అరికట్టేందుకు సమన్వయంతో పనిచేస్తున్నట్లు తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్లో జిల్లాలోని ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.