మెదక్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ) : ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి సత్వరమే పరిషరించాల్సిందిగా కలెక్టర్ రాజర్షిషా అధికారులను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ రమేశ్తో కలిసి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి 70 వినతులను స్వీకరించారు. ఇందులో ప్రధానంగా ధరణి, భూ సమస్యలకు సంబంధించిన వచ్చిన వినతులపై స్పందిస్తూ తగు చర్యలు తీసుకోవాల్సిందిగా రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు. డబుల్ బెడ్ రూం ఇండ్లు, పింఛన్లు, జిల్లా పంచాయతీ అధికారి, అటవీ శాఖ, మున్సిపాలిటీ, ఎస్సీ సంక్షేమం నీటిపారుదల తదితర శాఖలకు సంబంధించి వచ్చిన వినతులను ఆయా శాఖాధికారులకు అందజేస్తూ వాటిని పరిశీలించి నిర్ణీత కాలవ్యవధిలోగా, పరిషరిస్తూ ప్రజావాణి వెబ్సైట్లో అప్డేట్ చేయవలసినదిగా అధికారులకు సూచించారు.
కంటి వెలుగు శిబిరాలు సమర్థవంతంగా నడుస్తున్నాయో లేదో క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. నేత్ర పరీక్షలు చేస్తున్న వారికి రీడింగ్ అద్దాలు, మందులు వెంటనే అందించేలా చూడాలని, అవసరమైన స్టాక్ను భౌతికంగా పరిశీలించాలన్నారు. సంబంధిత ఎమ్మెల్యేల అంగీకారంతో వారం రోజులలోగా జిల్లాలో అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేలా అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు. వేసవి దృష్ట్యా రైతులకు ఇబ్బంది కలుగకుండా మంచి నీరు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. గ్రామ పంచాయతీ నర్సరీలలో జెర్మినేషన్ పరిశీలించాలని, షెడ్ నెట్ ఉండేలా చూడాలని, ప్రతి మొక బతికేలా నీరు పోయాలని ఏమైనా ఇబ్బందులుంటే జిల్లా అటవీ అధికారి, డీఆర్డీవో, డీపీవోలను సంప్రదించాలని సూచించారు. ప్రజావాణిలో అధికారులు శ్రీనివాస్ రావు, రవి ప్రసాద్, రాజేంద్ర ప్రసాద్, కమలాకర్, రజాక్, శ్రీనివాస్ గౌడ్, జెంలా నాయక్, సుధాకర్, నాగరాజ్, సార శ్రీనివాస్, బ్రహ్మాజీ, ఇందిర, కరుణ, శశి భూషణ్, కలెక్టరేట్ ఏవో యూనుస్, అధికారులు పాల్గొన్నారు.
సంగారెడ్డి కలెక్టరేట్ ప్రజావాణికి 29 అర్జీలు
సంగారెడ్డి కలెక్టరేట్, ఏప్రిల్ 24: ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు ప్రతి వారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టరేట్ ప్రజావాణికి అర్జీలు వెల్లువెత్తాయి. ఆయా అర్జీలను జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డి స్వీకరించారు. మొత్తం 29 అర్జీలు అందగా, అందులో 16 అర్జీలు రెవెన్యూ శాఖకు సంబంధించినవి కాగా, మిగతా శాఖలకు సంబంధించి 13 అర్జీలు ఉన్నాయి. ఆయా అర్జీలను సంబంధిత శాఖల అధికారులకు పంపిస్తూ వాటిని పరిష్కరించాలని అదనపు కలెక్టర్ సూచించారు. ప్రజావాణిలో ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం పెట్టుకున్న అర్జీలను పరిశీలించి వెంటనే పరిష్కరించాలన్నారు. ఆర్డీవోలు, కలెక్టరేట్ ఏవో, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.