నర్సాపూర్, జనవరి 22: నర్సాపూర్ మున్సిపల్లోని బస్టాండ్ సమీపంలో ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో వారు ఒకరిపై ఒకరు కత్తెరతో దాడి చేసుకున్న ఘటన నర్సాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నర్సాపూర్కు చెందిన హర్షద్ఖాన్ బస్టాండ్ సమీపంలో పూల వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నాడు.
పట్టణానికి చెందిన మన్నాన్ తాగిన మైకంలో అతని వద్దకొచ్చి, తనవద్దనున్న సెల్ ఫోన్ కొనాలని ఒత్తిడి తీసుకొచ్చాడు. దీంతో వారిరువురి మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. ఇద్దరు విచక్షణ కోల్పోయి అక్కడే ఉన్న పూల కత్తెరతో ఒకరిపై ఒకరు దాడిచేసుకున్నారు. ఈ దాడిలో ఇరువురికి గాయాలయ్యాయి. మన్నాన్ పొట్టలో కత్తెర దిగింది. దీంతో అతడిని స్థానిక దవాఖానకు చికిత్స నిమిత్తం తీసుకెళ్లారు. కేసు దర్యాప్తులో ఉంది.