సంగారెడ్డి, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ): చేనేత రంగ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని, చేనేత కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రత్యేక పథకాలు తీసుకువచ్చేందుకు పాటు పడతానని తెలంగాణ స్టేట్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన చింతా ప్రభాకర్ అన్నారు. నారాయణగూడ టెస్కో కార్యాలయంలో తెలంగాణ స్టేట్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ రాష్ట్ర మంత్రులు కేటీ రామారావు, టి.హరీశ్రావు ఆధ్వర్యంలో బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్ ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్రం సిద్ధించి, ప్రభుత్వం ఏర్పడ్డాక మనం స్వతహాగా చేనేత కార్మికులను ఆదుకోగలుగుతున్నం. గత ప్రభుత్వాలు ఎన్నడూ చేనేత రంగాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. గత ప్రభుత్వాలు, ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం హ్యాండ్లూమ్ బోర్డులను రద్దు చేసి కార్మికులు కడుపులు కొట్టాయి. మన తెలంగాణ ఉద్యమ నాయకుడు, మన సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ఇప్పుడిప్పుడే ఈ రంగాన్ని అభివృద్ధి చేసుకోగలుతున్నం. నేడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పవర్ లూమ్, హ్యాండ్లూమ్ కంపెనీలు, బోర్డులను రద్దు చేసి, సగటు కార్మికుల జీవితాలను పొట్టన పెట్టకున్నదన్నారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో నేడు చేనేత కార్మికులు కాస్త కోలుకోగలుగుతున్నారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ తనపై నమ్మకంతో అప్పగించిన ఈ బాధ్యతలను హ్యాండ్లూమ్ అభివృద్ధి సంస్థ ప్రగతి కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని పేర్కొన్నారు. సీఎం ఆధ్వర్యంలో చేనేత కార్మికుల కోసం ‘చేనేత బంధు, చేనేత బీమా’ పథకాలను తీసుకువచ్చేందుకు కృషి చేస్తానన్నారు. కార్యక్రమానికి హాజరైన పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్ గొప్ప అవకాశం కల్పించారని, ఆయన ఆశయాలకు అనుగుణంగా పని చేసి, చేనేత అభివృద్ధి సంస్థకు మంచి పేరు తీసుకురావాలని మంత్రులు ఆకాంక్షించి, శుభాకాంక్షలు తెలిపారు.
‘చింతా’కు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే గూడెం
పటాన్చెరు, సెప్టెంబర్ 28: తెలంగాణ రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్గా పదవి బాధ్యతలు స్వీకరిస్తున్న మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్ ప్రమాణస్వీకార కార్యక్రమంలో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం నగరంలోని చేనేత అభివృద్ధి సంస్థ కార్యాలయంలో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఐటీ మున్సిపల్శాఖ మంత్రి కే తారకరామారావు, వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్తో కలిసి కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని చింతా ప్రభాకర్కు శుభాకాంక్షలు తెలిపారు.
తరలివెల్లిన నాయకులు
తెలంగాణ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన చింతా ప్రభాకర్ను కలిసేందుకు సంగారెడ్డి నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ నాయకులు భారీగా తరలివెళ్లారు. హైదరాబాద్లో చింతా ప్రభాకర్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్కు తరలివెళ్లిన వారిలో సంగారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ బొంగుల విజయలక్ష్మి, వైస్ చైర్మన్ లతా విజయేందర్రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరిరెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ కృష్ణాగౌడ్, సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం, బీసీ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బీరయ్య యాదవ్, జడ్పీటీసీ సునీత మనోహర్గౌడ్, టీఆర్ఎస్ నాయకులు వెంకటేశ్వర్లు, నర్సింలు, ప్రదీప్, విష్ణువర్ధన్, నాగరాజ్గౌడ్ తదితరులున్నారు.