తూప్రాన్ మున్సిపాలిటీకి బెస్ట్ ఇన్నోవేషన్ ఇన్ ప్లాస్టిక్ మేనేజ్మెంట్ అవార్డు
హరితహారంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సంగారెడ్డి మున్సిపాలిటీ
పట్టణ ప్రగతి పురస్కారాల్లో భాగంగా ఎంపిక
మున్సిపల్ కమిషనర్లకు అందజేసిన మంత్రి కేటీఆర్
తూప్రాన్/సంగారెడ్డి అర్బన్, మే 13: 2021-22 పట్టణ ప్రగతి పురస్కారాల్లో భాగంగా తూప్రాన్ మున్సిపాలిటీకి బెస్ట్ ఇన్నోవేషన్ ఇన్ ప్లాస్టిక్ మేనేజ్మెంట్ అవార్డ్ వరించింది. ఈ అవార్డును తూప్రాన్ మున్సిపల్ కమిషనర్ మోహన్కు రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ తూప్రాన్ మున్సిపాలిటీకి ఈ అవార్డు రావడం గర్వకారణంగా ఉందన్నారు. దీనికి విశేషంగా కృషి చేసిన మున్సిపల్ చైర్మన్ రాఘవేందర్గౌడ్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. క్షేత్రస్థాయిలో కృషి చేసిన ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ శ్రీకాంత్, శానిటేషన్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, మున్సిపల్ సిబ్బంది మహేశ్, వినోద్, ఇర్ఫాన్, మల్లికార్జున్, అశోక్, వెంకటేశ్, మున్సిపల్ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.
సంగారెడ్డి మున్సిపాలిటీకి…
సంగారెడ్డి మున్సిపాలిటీకి పట్టణ ప్రగతి పురస్కారం దక్కింది. పట్టణ హరితహారంలో ప్రతిభ కనబర్చినందుకు ఈ అవార్డు వరించింది. ఇందులో భాగంగా శుక్రవారం హైదరాబాద్లో పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మీకి, జిల్లా అధికారులకు అవార్డును అందజేశారు. అవార్డు అందుకున్న వారిలో సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ రాజర్షి షా, మున్సిపల్ కమిషనర్ చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు.