న్యాల్కల్, సెప్టెంబర్ 12 : స్వయంభూగా వెలిసిన సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని రేజింతల్ సిద్ధివినాయక ఆలయం సెప్టెంబర్ 13న (మంగళవారం) జరిగే అంగారక సంకష్టహర చతుర్థి వేడుకలకు ముస్తాబైంది. ఏడాది పొడవునా ప్రతినెల వచ్చే సంకష్టహర చతుర్థి రోజుల్లో దర్శించుకుంటే ఎంత పుణ్యం వస్తుందో మంగళవారం రోజున వచ్చే అంగారక సంకష్టహర చతుర్థి రోజున దర్శించుకుంటే అంత పుణ్యఫలం వస్తుందనేది భక్తుల ప్రగాఢ నమ్మకం. ఎంతో పవిత్రమైన మంగళవారం రోజున వచ్చే అంగారక సంకష్టహర చతుర్థి రోజున దర్శించుకునేందుకు కర్ణాటక, మహారాష్ట, తెలంగాణ ప్రాంతాల నుంచి భక్తులు పాదయాత్రగా భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకోవడం ఓప్రత్యేకథ. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ కమిటీ సభ్యులు భారీ ఏర్పాట్లు చేశారు. ఆలయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనాలు జరుగకుండా జహీరాబాద్ డీఎస్పీ రఘు ఆధ్వర్యంలో జహీరాబాద్ రూరల్ సీఐ భరత్ కుమార్, హద్నూర్ ఎస్సై వినయ్ కుమార్ పర్యవేక్షణలో భారీ బందోబస్తు నిర్వహించనున్నారు.
ఆలయప్రాంగణంలో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తుల కోసం ప్రత్యేక బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఆయాప్రాంతాల నుంచి తరలివచ్చే వాహనాలను నిలిపేందుకు ప్రత్యేకంగా పార్కింగ్ను కూడా ఏర్పాటు చేశారు. తాగునీరు, వసతి, అన్నదానం తదితర సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశారు. అంగారక సంకష్టహర చతుర్థిని పురస్కరించుకొని మంగళవారం అర్థరాత్రి ఒంటి గంట నుంచి ఉదయం 6 గంటల వరకు స్వామివారికి అభిషేకం, స్వామివారి కల్యాణం, హారతి తదితర ప్రత్యేక పూజలను చేపట్టనున్నామని ఆలయ వేదపండితులు పేర్కొన్నారు. స్వామివారి దర్శన నిమిత్తం తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం జహీరాబాద్, బీదర్ ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సు నడిపేందుకు ఏర్పాట్లు చేశారు. భక్తు లు అధిక సంఖ్యలో హాజరై సిద్ధివినాయక స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆలయ కమిటీ అధ్యక్షుడు రేజింతల్ అశోక్, ప్రధాన కార్యదర్శి అల్లాడి నర్సింహులు తెలిపారు.