అందోల్, అక్టోబర్ 8: గ్రామాల అభివృద్ధే బీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. ఆదివారం మండల పరిధిలోని తాలెల్మ గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే రూ.20 లక్షలతో నిర్మిస్తున్న ఆరోగ్య ఉప కేంద్రం భవనం నిర్మాణం పనులు, రూ.10 లక్షలతో నిర్మిస్తున్న కమ్యూనిటీహాల్ భవనాల పనులకు శంకుస్థాపనలు చేయడంతో పాటు గృహలక్ష్మి ప్రొసీడింగ్ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి బీఆర్ఎస్ ప్రభుత్వ కొలువుదీరిన తర్వాత మారుమూల గ్రామాలు సైతం అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయన్నారు.
పల్లెప్రగతి ద్వారా ప్రతీ గ్రామంలో ఎన్నో మౌలిక సదుపాయాలు సమకూరాయని, ఇవన్నీ సీఎం కేసీఆర్ దూరదృష్టితోనే సాధ్యమయ్యాయన్నారు. తాలెల్మలో అన్ని వార్డుల్లో ఇప్పటికే సీసీ రోడ్లు, మురికికాల్వలు నిర్మించామని అభివృద్ధి పనుల విషయంలో గ్రామ సర్పంచులు, అధికారుల సహాయ, సహకరం ఎంతో ఉన్నదని మెచ్చుకున్నారు. గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుంచుతూ జిల్లాలో ఉత్తమ పంచాయతీగా నిలిపారని మెచ్చుకున్నారు.
కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు జైపాల్రెడ్డి, స్టేట్మార్కుఫెడ్ డైరెక్టర్ జగన్మోహన్రెడ్డి, ఎంపీపీ బాలయ్య, గ్రామ సర్పంచ్ లింగాగౌడ్, మున్సిపల్ చైర్మన్ మల్లయ్య, వైస్ చైర్మన్ ప్రవీణ్, పార్టీ మండలాధ్యక్షుడు లక్ష్మీకాంత్రెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, వైస్ ఎంపీపీ మహేశ్వర్రెడ్డి, ఎంపీటీసీ కృష్ణాగౌడ్, సర్పంచులు అనిల్రెడ్డి, నరేందర్రెడ్డి, నాయకులు వీరేశం, వెంకటేశం, పలు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.