సిటీబ్యూరో, నవంబర్ 22(నమస్తే తెలంగాణ): కార్పొరేట్ను తలదన్నేలా సేవలందిస్తున్న గాంధీ దవాఖానలో గ్యాస్ట్రో విభాగాన్ని మరింత బలోపేతం చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. అత్యంత ఖరీదైన కాలేయ మార్పిడి శస్త్రచికిత్సల కోసం ప్రత్యేకంగా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ యూనిట్ను ఏర్పాటు చేస్తున్న క్రమంలో గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగానికి రూ.1.50 కోట్ల విలువైన అత్యాధునిక వైద్యపరికరాలను సమకూర్చేందుకు శ్రీకారం చుట్టింది. ఇందులో ముఖ్యంగా ఖరీదైన కొలనోస్కోప్, ఎండోస్కోపి, పరీక్షల కోసం కొలనోస్కోప్ యంత్రం, అత్యాధునిక ఒలింపస్-190సిరీస్ అప్పర్ జీఐ తదితర పరికరాలను వైద్య, ఆరోగ్యశాఖ సమకూర్చింది. దీంతో నిరుపేద రోగులకు ఆర్థికంగా ఎంతో ఉపశమనం కలుగనుంది. ప్రతిరోజు గాంధీకి గ్యాస్ట్రోకు సంబంధించి 150 నుంచి 200మంది వరకు రోగులు ఓపీ సేవల కోసం వస్తుంటారని గాంధీ సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు తెలిపారు. ప్రతి రోజు 30 మంది గ్యాస్ట్రో విభాగంలో ఐపీ సేవలు పొందుతుంటారని తెలిపారు. ఓపీ రోగుల్లో ప్రతి రోజు కనీసం 10శాతం మందికి కొలనోస్కోప్ తదితర పరీక్షలు, 50 శాతం మందికి ఎండోస్కోప్ పరీక్షలు అవసరం పడుతుంటాయి.
ఎండోస్కోప్ పరీక్షకు బయట రూ.2 వేల నుంచి రూ.3వేల వరకు, కొలనోస్కోపి పరీక్షకు రూ.3వేల నుంచి రూ.6వేల వరకు ఖర్చవుతుంది. అత్యాధునికమైన వైద్యపరికరాలు అందుబాటులోకి రావడంతో ప్రజలపై ఆర్థిక భారం తప్పనుందంటున్నారు వైద్యనిపుణులు.పరీక్షలతో పాటు ప్రొసీజర్స్ కూడా చేయవచ్చు
గాంధీ దవాఖానలో సమకూర్చిన 190 సిరీస్ అప్పర్ జీఐ ఎండోస్కోపీ, కొలనోస్కోప్, సైడ్ వీవింగ్ ఎండోస్కోప్ తదితర పరికరాలతో వైద్య పరీక్షలే కాకుండా కొన్ని రకాల ప్రొసీజర్స్ కూడా చేయవచ్చంటున్నారు వైద్యనిపుణులు. పేగులు, జీర్ణాశయం తదితర వాటిపై ఏర్పడే పాలిక్స్, చిన్నపాటి ట్యూమర్స్ను తొలిగించాలంటే గతంలో శస్త్రచికిత్సలు చేయాల్సి వచ్చేదని, కానీ, ఇప్పుడున్న పరికరాలతో అతి తక్కువ సమయంలో ఎలాంటి కోత లేకుండానే ఒక పక్క వైద్య పరీక్షలు చేస్తూనే మరోపక్క పాలిక్స్, ట్యూమర్స్ను తొలిగించవచ్చని వైద్యులు తెలిపారు. అంతేకాకుండా రక్తస్రావం అయ్యే రక్తనాళాలను ఈ అత్యాధునిక ఎండోస్కోపి, కొలనోస్కోప్తో కట్ చేసి, మూసివేయవచ్చంటున్నారు వైద్యనిపుణులు. అంటే ఈ ఆధునిక పరికరాలు అటు వైద్యపరీక్షలతో పాటు చికిత్స చేయడానికి కూడా ఉపయోగపడుతున్నాయి.
కొత్తగా వచ్చిన వైద్య పరికరాలు
1. ఒలంపస్ 190సిరీస్ అప్పర్ జిఐ
2. కొలనోస్కోప్
3. సైడ్ వీవింగ్ ఎండోస్కోప్
4. ఫుజినాన్ ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్
అత్యాధునిక చికిత్స
కార్పొరేట్ దవాఖానల్లో కేవలం 10శాతం హాస్పిటల్స్లోనే ఇలాంటి ఆధునిక పరికరాలు ఉన్నా యి. గాంధీ దవాఖానలో లివర్ ట్రాన్స్ప్లాంట్ యూనిట్ను ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో మొదటిసారిగా అత్యాధునిక వైద్య పరికరాలను ప్రభుత్వం సమకూర్చుతోంది. దీని వల్ల రోగి ఆరోగ్య సమస్యలను క్షుణ్ణంగా గుర్తించడమే కాకుండా శస్త్రచికిత్సలకు లైన్ క్లియర్ చేసే వీలుంటుంది.
– డాక్టర్ రాజారావు, సూపరింటెండెంట్, గాంధీ దవాఖాన