చేర్యాల, డిసెంబర్ 30: పాల ఉత్పత్తి పెరగడంతో సరఫరా ఎక్కువైందని, సేకరణను తగ్గించేందుకు రాష్ట్రస్థాయి అధికారులు కుట్రలు చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. శనివారం చేర్యాల బల్క్ మిల్క్ చిల్లింగ్ సెంటర్ వద్ద చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట మండలాలకు చెందిన పాలరైతులు ఆందోళన చేశారు. యూనిట్ మేనేజర్ మురళితో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ తాము గేదెలు, ఆవుల నుంచి పితికిన పాలను నేరుగా గ్రామాల్లో ఉన్న పాలసేకరణ కేంద్రాలకు తీసుకొచ్చి నాణ్యమైన పాలు పోస్తే కల్తీ అనడం సబబు కాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోనే అత్యధిక పాలు సేకరిస్తున్న చేర్యాల పాల శీతలీకరణ కేంద్రంలో కల్తీ పాలు సరఫరా అవుతున్నాయని, పాలు కొనలేక విజయ డెయిరీ ఉన్నతాధికారులు కల్తీ పేరిట రిజెక్ట్ చేస్తున్నారన్నారు. చేర్యాల మిల్క్ చిల్లింగ్ యూనిట్కు 48 సెంటర్ల ద్వారా నిత్యం 10వేల లీటర్ల పాలను సరఫరా చేస్తున్నామన్నారు. ఇటీవల చేర్యాల ప్రాంతం నుంచి వచ్చిన పాలలో ఉప్పు కలుపుతున్నారని అధికారులు చేర్యాలకు ట్యాంకర్లను తిప్పిపంపడంతో అధికారులు పారబోశారు. క్వాలిటీ కంట్రోల్ అధికారులు హైదరాబాద్ ల్యాబ్లో అలంట్రేషన్ పరీక్షలు నిర్వహించగా ఉప్పు కలిపినట్టు ఫలితం రావడంతో వాటిని తిప్పి పంపించారని మేనేజర్ తెలిపారు. ఈ నెల 29న 50 క్యాన్ల పాలను కల్తీ జరిగాయని ఉన్నతాధికారులు ప్రకటించడంతో వాటిని పారబోయగా, శనివారం సైతం మరో 30 క్యాన్ల పాలను అధికారులు పక్కనపెట్టారు. ఎన్నడు లేని విధంగా అధికారులు తమ పాలు కల్తీ అయ్యాయని రిజెక్ట్ చేస్తుండడంతో చేర్యాల ప్రాంత రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.