రామాయంపేట, నిజాంపేట 23: ప్రకృతి ఒడిలో రమణీయంగా కనిపించే సువిశాలమైన బండ. పల్ల్లె సంసృతికి అద్దంపట్టే తీర్థం తిరుమలేశుడి బండ. ఏటా రథ సప్తమిని పురస్కరించుకుని ఐదు రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగే జాతరకు ఉమ్మడి రామాయంపేట మండలంలో ఉన్న తిరుమలేశుడి స్వామి క్షేత్రం ముస్తాబైంది. ఈ నెల 27 నుంచి 31వ తారీఖు వరకు తిరుమల బండపై జాతర జరుగనున్నది. రామాయంపేటకు 10 కిలోమీటర్ల దూరంలో సిద్దిపేట రహదారిలో ఉన్న చల్మెడ కమాన్ నుంచి మరో కిలోమీటర్ దూరంలో ఆలయం ఉంది. సుమారు 280 ఎకరాల్లో ఉన్న తిరుమల బండపై స్వామివారు కొలువై ఉన్నారు. సుమారు 20 పరిసర గ్రామాల ప్రజలు జాతరను అత్యం త సంబురంగా జరుపుకొంటారు. ఈ చల్మెడ తిరుమల నాథుడి ఆలయానికి గొప్ప చరిత్ర ఉంది. కాకతీయ రాజుల్లో ముఖ్యుడైన గణపతిదేవ చక్రవర్తి రాతి శిలలతో నిర్మించిన ఈ ఆలయం ఇప్పటికీ చెక్కు చెదరలేదు. జాతరకు ఉమ్మడి మెదక్ జిల్లానే కాక హైదరాబాద్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలు, మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ర్టాల నుం చి భక్తులు తరలివస్తారు.
స్థల పురాణం
వేయి సంవత్సరాల క్రితం కాకతీయుల రాజు గణపతి దేవుడి కాలంలో ఈ ఆలయం వెలిసినట్లు ఆలయ స్థల పురాణంలో ఉంది. 280 ఎకరాల విస్తీర్ణంలో ఏకశిల బండపై తిరుమల నాథస్వామి కొలువుదీరాడు. ఈ తిరుమల బండ ఆదిశేషువు ఆకారంలో ఉండడం విశేషం. బండపై కోనేరు చరిత్ర ఘనమైనది. శతాబ్దం క్రితమే ఆ బండపై 10 వరకు గుడిసెలు వేసుకుని ఒడ్డెరలు జీవించేవారు. ఒకరోజు ఒడ్డ్డెర కులస్తుడు రాళ్లు కొట్టి అలిసిపోయి రాత్రికి బండపై అలసి పడుకున్నాడు. అర్ధరాత్రి కలలోకి ఓ భిక్షువు వచ్చి ‘బాబూ.. అలసిపోయావు కొద్దిగా నీరైనా తాగు నాయనా’.. అని ఆ ఒడ్డెరను నిద్రలేపి నీరు తాగించాడట. నిద్రలోనే ఉన్న ఒడ్డెరకు బండ విశిష్టతను ఆ భిక్షువు తెలిపాడట. ‘తిరుమల నాథుడు నడయాడిన బండ ఇది. ఇక్కడ రుషులు భగవంతుడి సాక్షాత్కారం కోసం కఠోర తపస్సు చేసి తపస్సిద్ధి పొందిన మహిమాన్విత ప్రాంతం. బండపై తిరుమల నాథుడి రూపాన్ని ఆవిష్కరించి నిత్యపూజలు చేయు బాబు’.. అని చెప్పి అదృశ్యమైనట్లు స్థానిక పెద్దలు చెబుతుంటారు. భిక్షువు మాటలు విన్న వడ్డెర తనవాళ్లతో కలిసి బండపై తిరుమలేశుడి రూపాన్ని చెక్కాడట. అప్పటి నుంచి ప్రతి రథసప్తమి రోజున తిరుమల బండ జాతరను నిర్వహిస్తున్నారని స్థానికులు అంటారు. ఒడ్డెర కులస్తులతోపాటు వేలాది మంది భక్తులు ఇక్కడికి చేరుకుని ఎంతో భక్తితో పూజలు చేస్తారు.
బండపై నీటి గుండం..
తిరుమల నాథుడి ముఖద్వారానికి ఎదురుగా కోనేరు ఉంది. పూర్వం కోనేరు అడుగు భాగంలో నీళ్లు వస్తుండేవి. కాలక్రమేణా నీరు కొద్దిపాటిగా వచ్చేది. ఇప్పుడు పుష్కరిణి పూర్తిగా అడుగంటినా పాలకవర్గం ఏడాదంతా నీళ్లు ఉండేలా చూస్తున్నది. ఈ కోనేరులో స్నానమాచరిస్తే సంతానం కలుగుతుందని, అనారోగ్యంతో బాధపడేవారు ఈ గుండం లో స్నానమాచరించి స్వామి సన్నిధిలో ఒకరోజు బస చేస్తే సర్వరోగాలు నయమవుతాయని భక్తులు విశ్వసిస్తారు. కోనేటి నీటిని తీసుకెళ్లి పంటపొలాల్లో చల్లితే పంటలకు అధిక దిగుబడులు వస్తాయనేది భక్తులు నమ్ముతారు.
విశేష పూజలు ఇలా..
ఈ నెల 27 నుంచి 31వ తారీఖు వరకు బండ తిరుమల నాథస్వామి జాతర కొనసాగనున్నది. మొదటి రోజు తిరుమలేశుడికి విశేష పూజలు నిర్వహిస్తారు. రెండోరోజు బండ్ల ప్రదక్షిణం, స్వామివారి కల్యాణం ఉంటుంది. మూడోరోజు రథోత్సవం, నాలుగో రోజు భక్తుల అభిషేకాలు, సుదర్శన హోమాది కార్యక్రమాలు ఉంటాయి. జానపద గేయాలు, సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహిస్తారు. ఐదోరోజు చక్రతీర్థంతో జాతర ముగుస్తుంది.
జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి
రథసప్తమి రోజున జరిగే జాతరకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశాం. జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా ఆలయ సమీపంలో టెంట్లు, భక్తులకు సౌకర్యవంతంగా ఉండేందు కోసం పాలక వర్గం నీటి ట్యాంకులను ఏర్పాటు చేస్తున్నాం. ఆలయానికి వచ్చే భక్తుల కోసం శాశ్వత మంచినీటి ఏర్పాట్లను కూడా చేశాం. జాతరకు వచ్చే భక్తుల కోసం ప్రభుత్వం ప్రత్యేక వైద్యశిబిరాన్ని కూడా ఏర్పాటు చేస్తుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక నిధులను కూడా జాతర అభివృద్ధికి కేటాయించింది.
-ఆకుల మహేందర్, ఆలయ కమిటీ చైర్మన్
రూ.2 కోట్ల వ్యయంతో అభివృద్ధి
తిరుమల నాథ స్వామి ఆలయ అభివృద్ధి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నది. మునుపెన్నడూ లేనివిధంగా ఆలయానికి రూ.2 కోట్ల వ్యయంతో మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి కృషితో సత్రాలు, కల్యాణ మండపాన్ని నిర్మాణం చేపడ్తున్నాం. రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉంది. గత పాలక వర్గాల హయాంలో అభివృద్ధి అంటేనే ఎరుగని ఆలయాలను సీఎం కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకంగా నిధులను కేటాయించింది.
-దేవేందర్రెడ్డి, ఇఫ్కో డైరెక్టర్