గాంధీనగర్: ఆ మధ్య క్రికెటర్ కుల్దీప్ యాదవ్ తన ఇంట్లోనే కరోనా వ్యాక్సిన్ వేసుకున్న సంగతి తెలుసు కదా. ఇది కాస్తా బాగానే దుమారం రేపింది. తాజాగా గుజరాతీ ఫోక్ సింగర్ గీతా రాబారీ కూడా గుజరాత్లోకి కచ్ జిల్లాలో ఉన్న తన ఇంట్లోనే వ్యాక్సిన్ వేసుకోవడం మరో వివాదానికి దారి తీసింది. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న కచ్ జిల్లా ఉన్నతాధికారులు.. ఆమెకు వ్యాక్సిన్ ఇచ్చిన ఆరోగ్య కార్యకర్తకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇండియాకు వచ్చినప్పుడు ఏర్పాటు చేసిన నమస్తే ట్రంప్ ప్రోగ్రామ్లో గీతా ప్రదర్శన ఇచ్చింది.
తాజాగా శనివారం సాయంత్రం తన ఇంట్లో ఓ సోఫాలో కూర్చొని వ్యాక్సిన్ తీసుకున్న ఫొటోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. అది కాస్తా వివాదానికి దారి తీయడంతో వెంటనే ఆ ఫొటోను డిలీట్ చేసింది. దీనిపై కచ్ డీడీవో భవ్య వర్మాకు ఫిర్యాదు అందింది. ఆమె ఇంటికి వెళ్లిన ఆరోగ్య కార్యకర్తను వెంటనే గుర్తించాల్సిందిగా ఆదేశాలు జారీచేసినట్లు డీడీవో చెప్పారు. సదరు ఆరోగ్య కార్యకర్త తన వివరణ ఇచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.