‘మత్తు వదలరా’ ‘కలర్ఫొటో’ చిత్రాలతో స్వరకర్తగా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు కీరవాణి తనయుడు కాలభైరవ. ఆయన సంగీతాన్నందిస్తున్న తాజా చిత్రం ‘తెల్లవారితే గురువారం’. శ్రీసింహా కథానాయకుడు. మణికాంత్ దర్శకత్వం వహించాడు. ఈ నెల 27న విడుదలకానుంది. కాలభైరవ మాట్లాడుతూ ‘ఓ పెళ్లి వేడుకకు ముందురాత్రి జరిగే ఆసక్తికరమైన కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కథానుగుణంగా మూడు చక్కటి పాటలు కుదిరాయి. నా సోదరుడు శ్రీసింహా రెండో సినిమాకు కూడా నేనే స్వరాల్ని సమకూర్చడం ఆనందంగా ఉంది. సంగీతం, నటన గురించి మేమిద్దరం ఎప్పుడూ చర్చిస్తుంటాం. నా ఆల్టైమ్ ఫేవరేట్ సంగీత దర్శకులు నాన్న కీరవాణిగారే. చిన్నప్పటి నుంచి ఆయన సంగీతాన్ని వింటూ పెరిగాను కాబట్టి నా మ్యూజిక్పై ఆయన ప్రభావం తప్పకుండా ఉంటుంది. ప్రస్తుతం ‘ఆకాశవాణి’ ‘లక్ష్య’ ‘కార్తికేయ-2’ ‘గుర్తుందా శీతాకాలం’ చిత్రాలకు సంగీతాన్నందిస్తున్నా’ అని చెప్పారు.