నర్సాపూర్,డిసెంబర్12: నర్సాపూర్లో అత్యాధునిక హంగులతో ఉస్మానియా యూనివర్సిటీ పీజీ కళాశాల భవనాన్ని నిర్మిస్తామని ఎమ్మెల్యే మదన్రెడ్డి తెలిపారు. సోమవారం నర్సాపూర్ పీజీ కళాశాలకు 10 ఎకరాల స్థలం మంజూరు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వు లు జారీ చేసిన సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ డైరెక్టర్ జయప్రకాశ్కు ఉత్తర్వుల కాపీని ఎమ్మెల్యే అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నర్సాపూర్ పీజీ కళాశాలను మినీ యూనివర్సిటీగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమన్నారు. కళాశాలకు స్థలం కావాలని ముఖ్యమంత్రిని కోరి 10 ఎకరాలు సాధించానని, ఇంకా ఎక్కువ స్థలం తీసుకురావడానికి కృషి చేస్తానని వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్తో చర్చించి పది ఎకరాల స్థలంలో పీజీ కళాశాల పక్కా భవన నిర్మాణం కోసం రూ.20 కోట్ల నిధులు విడుదల చేయడానికి కృషి చేస్తానన్నారు.
పీజీ కళాశాల మూసివేస్తారని, తరలివెళ్తుందని ప్రచారం చేసిన వారికి ఇది చెంపపెట్టులాంటిదని అన్నారు. ఏడాది లోపు నూతన భవనంలోకి వెళ్లేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. విద్యార్థులు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని, అధైర్య పడవద్దని అండగా ఉంటామని తెలిపారు. అనంతరం ఉస్మానియా యూనివర్సిటీ డైరెక్టర్ వై.జయప్రకాశ్ మాట్లాడుతూ నర్సాపూర్లో పీజీ కళాశాల భవనానికి 10 ఎకరాలు మంజూరు కావడం శుభసూచకమన్నారు.
విద్యార్థులకు ఎమ్మెల్యేతో పాటు అందరి సహకారం ఉంటుందని వెల్లడించారు. అనంతరం విద్యార్థులు, కళాశాల బృందం ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించి, కృతజ్ఞత లు తెలిపారు. పీజీ కళాశాల భవన నిర్మాణానికి 10 ఎకరాల స్థలం ప్రభుత్వం కేటాయించడంతో విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పీజీ కళాశాల ప్రిన్సిపాల్ మహేశ్వర్రెడ్డి, ప్రొఫెసర్ డాక్టర్ ప్రవీణ్రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.