ఎస్సీ సోదరుల కోసం సాధికారత పథకం
మెదక్, జూలై 19 :నిరుపేద దళితులకు వరంగా దళిత బంధు మారబోతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దళితుల సంక్షేమానికి అనేక పథకాలు ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్ మరో విప్లవాత్మక సంస్కరణకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే ఎస్సీ కార్పొరేషన్ ద్వారా యువతకు, ఎస్సీ సంక్షేమ శాఖ ద్వారా విద్యార్థులకు పథకాలు బాసటగా నిలుస్తున్నాయి. ఇప్పుడు తెలంగాణ ‘దళిత బంధు’ పథకం ద్వారా వేలాది మంది దళితుల కష్టాలు నెరవేరనున్నాయి.
మధ్యవర్తుల ప్రమేయం లేకుండా..
తెలంగాణ ‘దళితబంధు’ పథకాన్ని మధ్య వర్త్తుల ప్రమేయం లేకుండానే నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో డబ్బును జమ చేస్తారు. అయితే తొలి దశలో కొంత మంది లబ్ధిదారులను లాటరీ విధానంలో ఎంపిక చేసి వారి ఖాతాల్లో డబ్బులు జమ చేస్తారు. ఇప్పటికే వృద్ధాప్య పింఛన్లు, రైతుబంధు పంపిణీ తరహాలోనే తెలంగాణ ‘దళితబంధు’ పథకాన్ని కూడా పారదర్శకంగా అమలు చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వచ్చే నాలుగేండ్లల్లో దళితబంధు పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం కోట్లు ఖర్చు చేసే ఆలోచనలో ఉంది. ఈ కేటాయింపులు ఎస్సీ సబ్ ప్లాన్కు అదనమని, నిరుపేద దళితులు అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలన్నదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. ఇందుకోసం సీఎం కేసీఆర్ దళితబంధు పథకం విధివిధానాల రూపకల్పన కోసం మంత్రులు, దళిత ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర పార్టీలకు చెందిన నేతల అభిప్రాయాలను తెలుసుకున్నారు.
నియోజకవర్గంలో వంద కుటుంబాలకు..
ఒక్కో నియోజకవర్గంలో వంద కుటుంబాలకు ఆర్థిక సాయం అందనున్నది. దళితబంధు పథకాన్ని క్షేత్ర స్థాయిలో పటిష్టంగా అమలు చేస్తారు. నియోజవకర్గంలో వంద కుటుంబాలను ఎంపిక చేసి ఒక్కో కుటుంబానికి రూ.10లక్షలు నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేయనున్నారు. ఈ డబ్బులతో ఏదైనా పనిని ఎంచుకొని అభివృద్ధి చెందే వెసులుబాటును ప్రభుత్వం కల్పిస్తుంది. అంతేకాకుండా ఈ పథకం ద్వారా అందించే రూ.పది లక్షల నగదుతో పాటు లబ్ధిదారుడు ప్రభుత్వం భాగస్వామ్యంతో రక్షణ నిధిని ఏర్పాటు చేస్తారు. కుటుంబంలో ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఈ డబ్బు వారికి సహాయపడుతోంది.
దళితుల జీవితాల్లో వెలుగులు..
దళితుల జీవితాల్లో సీఎం కేసీఆర్ వెలుగులు నింపుతున్నారు. దేశంలోనే తొలిసారిగా దళిత బంధు పథకం అమలు చేశారు. ఒక్కో కుటుంబానికి రూ.10లక్షలు నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ చేయడం గొప్ప విషయం. దళితుల సంక్షేమానికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ను ఎప్పటికీ మరిచిపోవద్దు.
దళితులకు వరం…
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం దళితులకు వరంలాంటిది. 70ఏండ్ల స్వాతంత్య్రంలో ఎన్నో రాజకీయ పార్టీలు వచ్చిపోయాయి. అయినా ఏ ప్రభుత్వం కూడా దళితుల సంక్షేమానికి కృషి చేయలేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దళితుల సంక్షేమానికి అనేక పథకాలను ప్రవేశపెట్టింది. ఇప్పుడు కొత్తగా దళిత బంధు పథకం తీసుకొచ్చి, దళితుల కుటుంబాల్లో వెలుగులు నింపుతోంది.
రూ.10 లక్షల ఆర్థిక సాయం ఎంతో సంతోషం..
నియోజకవర్గంలో వంద కుటుంబాలను ఎంపిక చేసి ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందజేయడం సంతోషంగా ఉంది. దళిత కుటుంబాలు సీఎం కేసీఆర్కు రుణపడి ఉండాలి. రూ.10 లక్షలతో ఏదైనా పనులు చేసుకోవచ్చని, ఆపద సమయంలో కూడా కుటుంబానికి ఈ డబ్బు అండగా నిలుస్తుంది.
దళిత బంధువు సీఎం కేసీఆర్..
దళితులకు దళిత బంధు పథకానికి శ్రీకారం చుట్టిన సీఎం కేసీఆర్ దళిత బంధువు. లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా రూ.10 లక్షలు జమ చేస్తారు. ఇప్పటికే దళితుల సంక్షేమం కోసం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలను అందజేస్తున్నారు. పరిశ్రమల శాఖ ద్వారా సబ్సిడీపై రుణాలను అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుంది. నియోజకవర్గంలో వంద కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడం గొప్ప విషయం.