కొల్లాపూర్, అక్టోబర్ 3 : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నార్లాపూర్(అంజనగిరి) రిజర్వాయర్లోకి 1.5 టీఎంసీల నీరు చేరడంతో జలసంబురం సంతరించుకున్నది. రెండు నల్లమల కొండలను కలుపుతూ చుట్టూ 2,224 ఎకరాల విస్తీర్ణంలో 11.02 కిలోమీటర్ల పొడవు, 74 మీటర్ల ఎత్తు, 8.41 టీఎంసీల నీటి నిల్వ సామర్థంతో రిజర్వాయర్ బండ్ రూపుదిద్దుకున్నది. దీంతో సోమవారం మధ్యాహ్నం వరకు అంజనగిరి రిజర్వాయర్లోకి 1.5 టీఎంసీల కృష్ణానది జలాలను ఒక మోటర్తో ఎత్తిపోసింది.
సోమవారం మధ్యాహ్నం వరకు నడిపించి మోటరును ఆపేశారు. చుట్టూ పచ్చని నల్లమల కొండల మధ్య కృష్ణమ్మ జలాలతో పరవళ్లు తొక్కుతున్నది. మొలచింతపల్లికి వెళ్లే బైపాస్ రోడ్డుపై నుంచి ఎటూ చూసిన కనుచూపు మేరలో అంజనగిరి రిజర్వాయర్ జలాలు ఆకాశంతో కలిసిపోయిన విధంగా కన్పిస్తున్నయి. ఇదిలా ఉండగా, నీటి డెలివరీ సిస్టర్న్ వద్ద నీటి ప్రవాహానికి ఒక పక్క మట్టి గోడ కోతకు గురికావడంతో మంగళవారం తాపీ కార్మికులు సిమెంట్తో కాంక్రీట్ పనులు చేపడుతున్నారు.