నాగర్కర్నూల్, ఏప్రిల్ 22 : ఆర్టీసీ కార్మికుల సమ్మెతో బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యా యి. ఆర్టీసీ కార్మికుల సమస్యలపై ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో ఆర్టీసీ జేఏసీ ఇచ్చిన పిలుపుతో మంగళవారం అర్ధరాత్రి నుంచే సమ్మె సైరన్ మోగింది. బుధవారం తొలిరోజు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని 9 డిపోల పరిధిలో కార్మికులు విధులకు హాజరుకాలేదు. బస్సులు బయటకు రాకుండా డిపోల వద్దకు చేరుకొని గేట్లు మూసి బైఠాయించి నిరసన తెలిపారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమ్మెను విఫలం చేసేందుకు అక్కడక్కడ బస్సులను పోలీస్ బందోబస్తు మధ్య నడిపించినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. కార్మికులు, పోలీసుల మధ్య వాదనలు జరిగాయి. ‘మా బతుకులు ఆగం చేయకండి’.. అంటూ మహబూబ్నగర్ ఆర్టీసీ బస్టాండ్ వద్ద బస్సులు బయటకు తీస్తున్న ప్రైవేటు కార్మికులకు
చేతులెత్తి మొక్కుతూ ఆర్టీసీ కార్మికులు వేడుకున్నారు. అయితే పోలీస్ పహారాలో బస్సులను బయటకు పంపారు. పాలమూరు డిపో వద్ద నిరసనలో పాల్గొనేందుకు వచ్చిన కార్మికుడు సొమ్మసిల్లి పడిపోయాడు. వనపర్తి డిపో నుంచి బస్సులు బయటకు రాకుండా మహిళా కార్మికులు అడ్డుకున్నారు. కల్వకుర్తి ఆర్టీసీ డిపో వద్ద ఉద్రిక్తత నెలకొన్నది. పోలీసుల బందోబస్తు మధ్య బస్సులను నడింపించేందుకు ఆర్టీసీ అధికారులు యత్నించగా.. కార్మికులు అడ్డుకున్నారు.
గుర్తు తెలియని వ్యక్తి బస్సుపైకి రాళ్లు విసరడంతో అద్దం పగిలిపోయింది. తాత్కాలిక బస్సు డ్రైవర్ కళ్లలోకి కారంపొడిని చల్లడంతో అతను బస్సు దిగి పరారయ్యాడు. అత్యవసర ప్రయాణం చేయాల్సి వచ్చిన ప్రయాణికులు ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల్లో ఉద్యోగులను విలీనం చేయడంతోపాటు పలు సమస్యలను పరిష్కరిస్తామని ఇచ్చిన హామీ ఏమైందని సిబ్బంది నిలదీశారు. అధికారం చేపట్టి రెండున్నరేండ్లు అయినా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఏనాడు
తమ గురించి పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చేసేది లేక ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించి.. గమ్యం చేరడానికి అవస్థలు పడ్డారు. ఇదే అదునుగా ప్రైవేటు వాహన యజమానులు ప్రయాణికుల నుంచి అధికంగా చార్జీలు వసూలు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రైవేట్ వాహనాల్లో పట్టణాలకు వచ్చిన ప్రయాణిల పరిస్థితి వర్ణణాతీతం.