మూసాపేట, మార్చి 2 : కరువు ప్రాంతాల్లో పసిడి పంటలు పండించేందుకుగానూ భూగర్భ జలాల పెంపునకు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి, ప్రభుత్వం చేసిన కృషి అమోఘమని పంజాబ్ బృందం సభ్యులు కితాబిచ్చారు. పంజాబ్ ముఖ్యమంత్రి సూచన మేరకు అక్కడి వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి ఆర్ఆర్ఎస్ బల్లోవల్ సౌంక్రీ డైరెక్టర్ డాక్టర్ మన్మోహన్జిత్సింగ్, మట్టీ, నీటి శాఖ విభాగం శాస్త్రవేత్తలు డాక్టర్ సంజయ్ సత్పూటే, డాక్టర్ అబ్రార్ యూసఫ్, బృందం సభ్యులు దేవరకద్ర నియోజకవర్గంలో పర్యటించారు.
మూసాపేట మండలంలోని పోల్కంపల్లి గ్రామంలో నిర్మించిన ఫాంపాండ్, నిజాలాపూర్ పెద్దవాగుపై నిర్మించిన చెక్డ్యాం, సంకలమద్ది, కొమిరెడ్డిపల్లిలో నిర్మించిన చెక్డ్యాం, నిల్వ నీటికి షట్టర్ ఏర్పాటు చేసి కాల్వ ద్వారా చెరువులు నింపడానికి చేపట్టిన చర్యలను పరిశీలించారు. నిజాలాపూర్ గ్రామంలో బృందానికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బృందం సభ్యులు మాట్లాడుతూ దేశంలోనే పాలమూరు జిల్లా కరువు ప్రాంతంగా పేరుగాంచిందన్నారు. అయితే, ప్రస్తుతం మునుపెన్నడూ లేని విధంగా పంటలు ఎలా పండిస్తున్నారని, ఇందుకుగానూ ఎలాంటి చర్యలు చేపట్టారని ఇరిగేషన్ అధికారులు, స్థానికులను అడిగి తెలుసుకున్నారు. గ్రామస్తులు మాట్లాడుతూ ‘ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి సహకారంతో నియోజకవర్గంలోని వాగులపై చెక్డ్యాంలు నిర్మించారు.
ఎంజీకేఎల్ఐ ద్వారా కృష్ణా జలాలను తీసుకొచ్చి వాగులోకి వదలడంతో ఏడాది పొడవునా నీళ్లు నిల్వ ఉంటున్నాయి. చెరువులను మిషన్ కాకతీయ పథకంలో భాగంగా పూడిక తీయించడం, కట్టల మరమ్మతులు చేపట్టారు. చెరువులను కృష్ణాజలాలతో నింపడంతో అడుగంటిపోయిన భూగర్భజలాలు పైపైకి వస్తున్నాయి. చెక్డ్యాంల పక్కన కొన్ని చోట్ల మోటార్లు పెట్టకుండానే నీళ్లు ఉబికి వస్తున్నాయి.’ అని సమాధానమిచ్చారు. కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ ఎస్ఈ ఎల్.చక్రధరం, ఈఈ ఎస్.వెంకటయ్య, డీఈ ఎం.కృష్ణ, ఏఈ శ్రీనివాసులు, భూగర్భజల శాఖ డీఈ రాజేంద్రకుమార్, హరీశ్, నాయకులు లక్ష్మీనర్సింహయాదవ్, కొండయ్య, చంద్రశేఖర్, సత్యమ్మ, గోవర్ధన్, శివరాములు, భీమన్న, మశ్ఛందర్నాథ్, ఎంపీడీవో స్వరూప, ఎంపీవో సరోజ, రైతులు పాల్గొన్నారు.