మహబూబ్నగర్, జూన్ 13 : పాలమూరు అంటే గతంలో కరువు గుర్తొచ్చేదని.. ప్రస్తుతం పచ్చని పంటలతో కళకళలాడుతున్నదని కేంద్ర జలశక్తి అభియాన్ నోడల్ అధికారి పౌసామిబసు అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్ జి.రవినాయక్తో కలిసి మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాల అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షలో ఆమె మాట్లాడారు. పెరిగిన భూగర్భ జలాలను సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత రైతులు, ప్రజలపై ఉందన్నారు. గతంలో కేవలం కరువు ఛాయలు మాత్రమే కనిపించేవని, నేడు ఎక్కడ చూసినా పచ్చదనం, మౌలిక సదుపాయాల కల్పన, ఎంతో మార్పు కనిపిస్తున్నదన్నారు. ఎంఆర్ఎం కింద చేపట్టిన కందకాల తవ్వకం, ఫీడర్ ఛానళ్లు, ఊటకుంటలు, కాంటూర్ కందకాలు, చెరువుల్లో పూడికతీత వంటివి పెంచడం వల్ల భూగర్భజలాలు బాగా పెరిగినట్లు గుర్తించామన్నారు. గడిచిన రెండు రోజుల్లో జిల్లా వ్యాప్తంగా పర్యటించడం జరిగిందన్నారు.
రైతులు పంట విధానాన్ని మార్చాల్సిన అవసరం ఉందన్నారు. ఆరుతడి పంటల వైపు ప్రజలు ఆలోచన చేయాలని, ఆయిల్పాం తోటలను పెంపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. రానున్న రెండు, మూడేండ్లలో అనేక మార్పులు వస్తాయన్నారు. అటవీశాఖ ద్వారా క్యాంపు కింద అడవుల్లో చేసే నీటి సంరక్షణ కార్యక్రమాల ద్వారా భూగర్భజలాలు సైతం బాగా పెరిగాయన్నారు. అనంతరం కలెక్టర్ జి.రవినాయక్ మాట్లాడుతూ.. నీటి సంరక్షణ కార్యక్రమాల్లో భాగంగా గతంలో చేపట్టిన నిర్మాణాలు పాడైపోయినందునా తిరిగి వాటిని పునరుద్ధ్దరించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలు, రైతులలో నీటి సంరక్షణ కార్యక్రమాలపై మరింతగా అవగాహన పెంచాలని కోరారు. భూగర్భజలాలు అభివృద్ధి చేసేందుకు అమృత్ సరోవర్ కింద మరిన్ని చర్యలను చేపడితే బాగుటుందన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సీతారామారావు, డీఎఫ్వో సత్యనారాయణ, డీఆర్డీవో యాదయ్య, ఆర్డీవో అనిల్కుమార్, మున్సిపల్ కమిషనర్లు ప్రదీప్కుమార్, మహమూద్ హుస్సేన్ తదితరులు ఉన్నారు.