మహబూబ్నగర్ అర్బన్, మార్చి 29: అభివృద్ధి, సంక్షేమం రెండు కండ్లలాంటివని, వీటిని చూసే పలు పార్టీల నాయకులు, కార్యకర్తలు గులాబీ పార్టీలోకి వలసలొస్తున్నారని ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. జిల్లాకేంద్రంలోని 34వ వార్డు కౌన్సిలర్ జాజీమొగ్గ నర్సింహులు ఆధ్వర్యంలో 200మంది మంత్రి సమక్షంలో బుధవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అదేవిధంగా జిల్లాకేంద్రంలోని హైటెక్ ఫంక్షన్హాల్లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో వివిధ గ్రామాలకు చెందిన 100మంది కాంగ్రెస్, బీజెపీ నాయకులు, కార్యకర్తలు మంత్రి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
వారందరికీ మంత్రి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రతి వార్డు, గ్రామం అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. గతంలో 100 ఎకరాల భూమి ఉన్న రైతు కూడా వలస వెళ్లేవాడని, ఇప్పుడు ఆ పరిస్థితులు లేవని స్పష్టం చేశారు. ప్రతి కార్యకర్త పార్టీలో సైనికుడిలా పనిచేయాలని, పనికి తగిని గుర్తింపు లభిస్తుందన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.