ఎర్రవల్లి చౌరస్తా, జనవరి 13 : ఎన్హెచ్-44పై ఘోరం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తాపడిన ఘటనలో షార్ట్సర్క్యూట్తో మంటలంటుకొని తెల్లవారకముందే ఒకరి బతుకు తెల్లారింది. కాపాడమని దీనంగా వేడుకుంటూనే మంటల్లో ఆహుతైంది. ఈ హృదయ విదారక ఘటన జోగుళాంబ గద్వాల జిల్లాలో చోటు చేసుకున్నది. ఎస్సీ రితిరాజ్, ఎస్సై అశోక్బాబు కథనం మేరకు.. అమెజాన్ జగన్ ట్రావెల్స్కు చెందిన వోల్వో బస్సు (ఏపీ 39 ఎక్స్ 4663) శుక్రవారం రాత్రి 7:30 గంటలకు హైదరాబాద్లోని మియాపూర్ నుంచి ఏపీలోని చిత్తూరుకు బయలుదేరింది. మొత్తం 32 మంది ప్రయాణికులు ఆన్లైన్లో బుకింగ్ చేసుకోగా.. వారితోపాటు ఇద్దరు డ్రైవర్లతో రాత్రి 11 గంటల సమయంలో ఆరాంఘర్ చౌరస్తా వద్దకు చేరగా.. అక్కడ మరో ఐదుగురు ప్రయాణికులు ఎక్కారు.
స్టార్టింగ్ పాయింట్ నుంచి మధ్యర్రాతి ఒంటిగంట వరకు జడ్చర్ల సమీపంలోని మునావర్ దాబా చేరే వరకు ఒక డ్రైవర్, అక్కడి నుంచి రెండో డ్రైవర్ షాబుద్దీన్ బస్సు నడిపాడు. జోగుళాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం టెన్త్ బెటాలియన్ సమీపంలోని హెచ్పీ పెట్రోల్ బంక్ ఎదురుగా 2:30 గంటల ప్రాంతంలో డ్రైవర్ నిద్రలోకి జారుకోవడంతో ముందు వెళ్తున్న లారీని ఓవర్టేక్ చేయబోయి అదుపుతప్పి రోడ్డు పక్కకు బోల్తాపడింది. అప్రమత్తమైన ప్రయాణికులు బస్సులోంచి బయటకు వ చ్చారు. అయితే మెహిదీపట్నానికి చెందిన మాలతి (40) బస్సులోని సీటు కింద ఇరుక్కుపోయింది. ఆమె కేకలు విన్న తోటి ప్రయాణికులు, స్థానికుడు కాపాడేందుకు శతవిధాలా ప్రయత్నించారు. వెంటనే షార్ట్ సర్క్యూట్తో బస్సులో పొగలు రావడంతో భయంతో వారు బయటకు వెళ్లిపోగా.. అకస్మాత్తుగా మంటలు అంటుకొని బస్సు పూర్తిగా దగ్ధమైంది. దీంతో కాపాడాలని ప్రయాణికురాలు దీనంగా ఆర్తనాదాలు చేస్తూనే మృత్యుఒడిలోకి చేరి సజీవ దహనమైంది. ఆమె ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ సెంటర్(ఐఆర్ఆర్)లో కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగిగా విధులు నిర్వర్తిస్తున్నది. చిత్తూరులో ఉన్న ఆమె భర్త మారుతి శ్రీనివాస్ (వ్యాపారి) వద్దకు వెళ్తుండగా.. ప్రమాదం చోటు చేసుకున్నది. ఏడుగురికి స్వల్ప గాయాలు కాగా.. మరో 29 మంది ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.
స్పందించిన పోలీసులు
ప్రమాదం జరిగిన సమీపంలోని పదో పటాలం శివారులో పెట్రోల్ బంక్ వద్ద విధుల్లో ఉన్న పీ సీ వెంకటేశ్వర్లు, రామకృష్ణ, శివ వెంటనే స్పందించారు. ఇటిక్యాల ఎస్సై అశోక్బాబు, గద్వాల ఫైర్ సిబ్బంది, ఎన్ఏఐహెచ్కు సమాచారం అందించగా గ్యాస్ సిలిండర్లతో బస్సు వద్దకు చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. సమాచారం అందుకున్న ఇటిక్యాల బ్లూకోల్ట్స్ సిబ్బంది కానిస్టేబుల్ ప్రవీణ్, వరదరాజు, హైవే సిబ్బంది విజయ్, షావలీ ఘటనా స్థలానికి చేరుకున్నారు. సీఐ రాజు, గద్వాల డీఎస్పీ వెంకటేశ్వర్లుకు సమాచారం అందించగా అధికారులు చేరుకొని క్షతగాతుల్రను సురక్షితంగా కర్నూల్ దవాఖానకు తరలించారు. ప్రయాణికు రాలు అరుణ 10 తులాల బంగారం ఉన్న బ్యాగ్ను మరిచిపోగా, పోలీసులు వెతికి ఆమెకు అప్పగించారు.
పరామర్శించిన ఎమ్మెల్యేలు
బస్సు ప్రమాదం జరిగిన విషయాన్ని తెలుసుకున్న అలంపూర్, గద్వాల ఎమ్మెల్యేలు విజయు డు, బండ్ల కృష్ణమోహన్రెడ్డి, తాసీల్దార్ నందిని, డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ రాజు, ఎస్సై అశోక్బాబుతోపాటు పలువురు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతురాలు మాలతి కుటుంబానికి సానుభూతి తెలిపి రూ.50లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని ఎమ్మె ల్యే విజయుడు కోరారు.
రియల్ హీరో ఇమ్రాన్
శనివారం తెల్లవారుజామున బస్సు ప్రమాదం జరుగగా అందరూ భయంతో పరుగులు తీస్తుంటే ఒకే ఒక్కడు మాత్రం ప్రాణాలను పణంగా పెట్టి ప్రయాణికులను కాపాడాడు. చిత్తూరుకు చెందిన ఇమ్రాన్ ఎడమచేయి విరిగినా లెక్క చేయకుండా బస్సు అద్దాలు పగులగొట్టి ఐదుగురు ప్రయాణికులను రక్షించాడు. దీంతో పోలీసులు, ప్రజలు, తోటి ప్రయాణికులు అతడిని అభినందించారు. రియల్ హీరో అంటూ అందరూ ప్రశంసలు గుప్పించారు. అయితే అతడి ఒరిజినల్ స్టడీ సర్టిఫికెట్లు మాత్రం కోల్పోయాడు.