మహబూబ్నగర్ టౌన్, ఆగస్టు 28 : జిల్లాలో క్రీడారంగానికి బాటలు వేగంగా పడుతున్నాయి. జిల్లాలో ఎంతోమంది ప్రతిభ గల క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయస్థాయిలో రాణిస్తున్న విషయం తెలిసిందే. క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పట్టణాభివృద్ధితోపాటు క్రీడాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈక్రమంలో క్రీడామైదానాలు శరవేగంగా పూర్తవుతున్నాయి.
జిల్లాలో రూ.17కోట్ల 32లక్షలతో క్రీడా మైదానాలను అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పటికే రూ.2కోట్ల 50లక్షలతో స్టేడియాల ఆధునీకరణ చేపట్టారు. ప్రధాన స్టేడియంలో వాలీబాల్, బాస్కెట్బాల్, హ్యాండ్బాల్, కబడ్డీ, ఖోఖో, హైజంప్, లాంగ్ జంప్ కోర్టులు అందుబాటులోకి వచ్చాయి. మంత్రి శ్రీనివాస్గౌడ్ ప్రత్యేక దృష్టి సారించి రూ.6కోట్ల 99లక్షల నిధులు మంజూరు చేయించడంతో మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఎంవీఎస్ డిగ్రీ కళాశాల ఆవరణలో రూ.2.65కోట్లతో మినీస్టేడియాన్ని పూర్తి చేశారు. దేవరకద్ర నియోజవర్గం భూత్పూర్ మండలంలో రూ.3.40కోట్లతో స్టేడియం నిర్మాణం చేపడుతున్నారు.
తుది దశలో మల్టీపర్పస్ స్టేడియం పనులు..
స్టేడియం మైదాన సమీపంలో ఉన్న బాస్కెట్బాల్ కోర్టు నుంచి సోషల్ వెల్ఫేర్ కార్యాలయ స్థలంలో రూ.6.99కోట్లతో మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియాన్ని అన్ని హంగులతో నిర్మిస్తుండగా పనులు తుది దశకు చేరాయి. ఎంవీఎస్ డిగ్రీ కళాశాల ఆవరణలో నిర్మించిన మినీస్టేడియం ఇండోర్ గేమ్స్కు ఎంతో ఉపయోగంగా ఉంటుంది. ఎంతోమంది ఔత్సాహిక క్రీడాకారులకు మేలు జరుగనుంది. ఇప్పటికే ఉన్న వనరులతోనే కోచ్లు, పీఈటీలు, దాతల సహకారంతో ఎంతోమంది క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు.
త్వరలో ప్రారంభిస్తాం..
మహబూబ్నగర్లోని మల్టీపర్పస్ ఇండోర్స్టేడియం పనులు త్వరలోనే ప్రారంభిస్తాం. ఇప్పటికే ఎంవీఎస్ డిగ్రీ కళాశాలలో మినీ ఇండోర్ స్టేడియాన్ని ప్రారంభించాం. ప్రధాన స్టేడియం ఆధునీకరణ పనులు చేపట్టాం. వాలీబాల్, అర్చరీ, బాస్కెట్బాల్, హ్యాండ్బాల్, కబడ్డీ, ఖోఖో, హైజంప్, లాంగ్జంప్ కోర్టులు ఏర్పాటు చేశాం. జాతీయ, అంతర్జాతీయ క్రీడా పోటీలు మహబూబ్నగర్లో నిర్వహించేందుకు కృషి చేస్తాం. పట్టణాభివృద్ధితోపాటు జిల్లాలో క్రీడాభివృద్ధికి కృషి చేస్తున్నాం.
– శ్రీనివాస్గౌడ్, క్రీడాశాఖ మంత్రి