Interest | పేదలు, సామాన్యుల అవసరాలను ఆసరాగా చేసుకుంటున్న వ్యాపారులు అధిక వడ్డీలకు డబ్బులు ఇస్తూ వడ్డీ వ్యాపారాన్ని బిందాస్గా నడిపించుకుంటూ పేదల కష్టాన్ని దోచుకుంటున్నారు. ప్రస్తుతం పెరిగిన ధరలతో సా మాన్య కుటుంబం రోజువారిగా గడవడమే కష్టంగా మారింది. ఇలాంటి తరుణంలో కుటుంబ ఆర్థిక పరిస్థితులు, పిల్లల చదువులు, ఆడపిల్లల పెళ్లిళ్లు ఇలా తమ అత్యవసరాల కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయించక తప్పడంలేదు. ప్రజల అవసరాలను అవకాశంగా తీసుకొని వడ్డీ వ్యాపారులు వారికి సంబంధించి వేలల్లో డబ్బయితే ప్రామిసరీ నోటు, లక్షల్లో అయితే ఆస్తిపత్రాలను వద్ద ఉంచుకొని రూ.3నుంచి రూ.10వరకు వడ్డీకి డబ్బులు ఇస్తున్నారు. దీంతో తీసుకున్న అప్పుకు అసలుతో సహా వడ్డీకి వడ్డీ, చక్రవడ్డీ, బారువడ్డీ చెల్లించలేక ఆస్తిపాస్తులు విడిపించుకోలేక ఎంతో మంది ఆత్మహత్యలకు పాల్పడిన సంఘటనలు కొకొల్లాలు. అనేక మంది వడ్డీ వ్యాపారుల ఊబిలో చిక్కుకొని తీసుకున్న అప్పు తిరిగి చెల్లించలేక మదనపడుతున్నారు.
అవసరాలకు బ్యాంకుల్లో రుణాలు పొందేందుకు సవాలక్ష నిబంధనలు విధిస్తున్నారు. మధ్యవర్తుల ద్వారా కమీషన్లు ముట్టజెప్పి పనులు కానిచ్చే వారికే ప్రాధాన్యత ఇవ్వడంతో పేదలు, సామాన్యులు బ్యాంకుల్లో రుణాలు రావని ఆశలు వదులుకుంటున్నారు. ఒకవేళ ఎవరికైనా ఇచ్చినా మధ్యవర్తులు కమీషన్లకే సగం డబ్బులు ఖర్చవుతున్నాయని వెనుకడుగు వేస్తున్నారు. గత్యంతరం లేక చాలా మంది తమ అత్యవసరాలకు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తుంది.
తీసుకున్న అప్పుకు అసలు చెల్లించలేక, వడ్డీమీద వడ్డీకట్టలేక ఓ దశలో తనఖా పెట్టిన ఆస్తులు తిరిగి పొందలేక వదిలించుకుంటున్న వారి సంఖ్యకు అంతులేకుండా పోతోంది. నియోజకవర్గంలోని పలు మండలాల్లో వడ్డీ వ్యాపారం జోరుగా కొనసాగుతోంది. ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగులు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు ఈ వ్యాపారాన్ని అధిక సంపాదనకు కేరాఫ్ అడ్రస్గా పెట్టుకొని అనువైనా మార్గంగా ఎంచుకుంటున్నారు. ప్రధానంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు సైడ్ బిజినెస్గా వడ్డీ వ్యాపారాన్ని ఎంచుకొని ముందుకు సాగుతున్నారు.
ఇటీవలే నాగర్కర్నూల్ జిల్లాలోని తిమ్మాజిపేట మండలం కోడుపర్తిలో గో పికృష్ణ అనే వ్యక్తి తెలిసిన వారికి లక్షల్లో అప్పు ఇప్పించాడు. ఆ వ్యక్తి తిరిగి ఇవ్వకపోడంతో అప్పు ఇచ్చిన వ్యక్తి గోపికృష్ణపై ఒత్తిడి పెంచాడు. దీంతో ఒత్తిడి తట్టుకోలేక గత సోమవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇలా.. అప్పుల బాధతో ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు అనేకం ఉన్నాయి.