గద్వాల, జూన్ 28 : ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలనే లక్ష్యంతో ఇంగ్లిష్ భాషలో చదివేందుకు, మాట్లాడేందుకు సులభంగా ఉండేలా ‘టీచ్ ఫర్ ఛేంజ్’ అనే కార్యక్రమాన్ని జిల్లాలో ప్రారంభిస్తున్నట్లు సినీనటి మంచు లక్ష్మీప్రసన్న తెలిపారు. బుధవారం జోగుళాంబ గద్వాల జిల్లాకు వచ్చిన మంచులక్ష్మి కలెక్టరేట్లో కలెక్టర్ వల్లూరు క్రాంతిని కలిశారు. అనంతరం కలెక్టరేట్ సమావేశ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మంచులక్ష్మి తాను నడుపుతున్న సంస్థ గురించి తెలిపారు. గద్వాల చేనేత చీరలకు ప్రపంచంలోనే ఎంతో ప్రసిద్ధి ఉందన్నారు. తమ సంస్థ ఆధ్వర్యంలో గతేడాది యాదాద్రి జిల్లాలో 56 పాఠశాలల్లో టీచ్ ఫర్ ఛేంజ్ కార్యక్రమం నిర్వహించామని, మెరుగైన ఫలితాలు రావడంతో ప్రతి ఏడాది కొన్ని జిల్లాలను ఎంపిక చేసుకొని విద్యార్థులకు డిజిటల్ విద్యను అందిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు సరికొత్త బోధనా విధానాన్ని అవలంభిస్తూ సులభంగా ఇంగ్లిష్ నేర్చుకునేలా నిఫుణుల ద్వారా బోధన పద్ధతులను తెలియజేస్తామన్నారు. విద్యాబోధన మూడు దశల్లో ఒకటి నుంచి ఐదు తరగతుల విద్యార్థులకు ఆంగ్లబోధన ఉంటుందన్నారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో 30 పాఠశాలలను ఎంపిక చేసుకున్నట్లు చెప్పారు. ఎంపిక చేసిన పాఠశాలలకు టీవీ, వాల్పేయింటింగ్, కార్పెట్స్, బోధన సామగ్రి అందజేస్తామని తెలిపారు.
ప్రజల సహకారం అవసరం..
కలెక్టర్ వల్లూరు క్రాంతి మాట్లాడుతూ.. పేద విద్యార్థులకు మెరుగైన విద్య అందించేందుకు ప్రజల సహకారం ఎంతో అవసరమన్నారు. వెనుకబడిన జిల్లాలో విద్యార్థులకు మెరుగైనా విద్యను అందించేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. విద్యాభివృద్ధికి తోడ్పాటును అందిస్తున్నందుకు మంచులక్ష్మిని కలెక్టర్ అభినందించారు. ఎంపిక చేసిన పాఠశాలలో ఉండే ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని విద్యార్థులందరూ హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని, విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేసి కార్యక్రమ వివరాలు తెలియజేయాలని డీఈవో సిరాజుద్దీన్ను ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అపూర్వచౌహాన్, సిబ్బంది మైథిలి, ధరణి, ఎస్తేర్రాణి తదితరులు పాల్గొన్నారు.