మహబూబ్నగర్, జూలై 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : గతంలో వైద్యం కోసం హైదరాబాద్ వెళ్లాల్సి వ చ్చేదని, ప్రస్తుతం ఏర్పాటు చేయనున్న అధునాతన దవాఖాన వల్ల గాంధీ, ఉస్మానియా తరహా వైద్యం స్థానికంగానే అందుతుందని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న కలెక్టరేట్ భవనాన్ని కూల్చేసి.. ఆ స్థలంలో రూ.400 కోట్లతో సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మించనున్నామన్నారు. సోమవారం ప్రస్తుత కలెక్టరేట్లోని ఆర్డీవో కార్యాలయాన్ని మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కొత్త కలెక్టరేట్కు ఇక్కడి కార్యాలయాలన్నింటినీ తరలించిన తర్వాత వెంటనే దవాఖాన పనులు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మాణానికి అంగీకరించిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. అధునాతన మోడ్రన్ షాపింగ్ కాం ప్లెక్స్, టూరిజం హబ్ కూడా ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రంలోనే అత్యంత సుందరమైన దవాఖానగా తీర్చిదిద్దుతామన్నారు. తెలంగాణను ఆదర్శంగా తీసుకొని ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ర్టాలు కొత్త జిల్లాలు ఏర్పాటు చేశాయన్నారు.
డీఆర్డీవో కార్యాలయ భవనం పెచ్చులూడి పిల్లర్లు సగానికి విరిగిపోయి కూలిపోయే దశకు చేరుకున్నదని, ఈ భవనాన్ని వెంటనే ఖాళీ చేయకుంటే సిబ్బందికి ప్రమాదం పొంచి ఉందన్నారు. ఆర్అండ్బీ అధికారుల భవనం పరిస్థితి కూడా బాగాలేదని ధ్రువీకరణ ఇచ్చిన అంశాన్ని మంత్రి తెలిపారు. కూలిపోయే స్థితిలో ఉన్నందునే భవనాన్ని కూల్చి దవాఖాన నిర్మించేందుకు కాంట్రాక్టర్ సిద్ధంగా ఉండాలన్నారు. ప్రస్తుతం ఉన్న జిల్లా దవాఖాన వద్ద నర్సింగ్ కళాశాల నిర్మించనున్నట్లు తెలిపారు. ఆర్డీవో కార్యాలయం సమీపంలో నిర్మాణంలో ఉన్న వినాయక భవన్ పెండింగ్ పనులను వెం టనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఫ్లో రింగ్, షెడ్ నిర్మాణం, రేకులు, కాంపౌండ్ నిర్మాణానికి అంచనాలు రూపొందించాలని.. రాబోయే వినాయక చవితి నాటికి భవనం అందుబాటులోకి రావాలన్నారు. జిల్లా అభివృద్ధిలో కలెక్టర్, అధికారుల పాత్ర వెలకట్టలేనిదని అభినందించారు. కార్యక్రమంలో కలెక్టర్ వెంకట్రావు, అదనపు కలెక్టర్లు తేజస్ నందలాల్ పవార్, సీతారామారావు, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, ఆర్డీవో అనీల్కుమార్, అర్బన్ తాసిల్దార్ పార్థసారథి, అధికారులు పాల్గొన్నారు.