ఆర్ఎన్ఆర్ సన్నరకాల ధాన్యానికి రికార్డు ధరలు పలుకుతున్నాయి. రాష్ట్ర మార్కెట్ చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా ధరలు పలుకుతుండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత సీజన్లో క్వింటాకు రూ.2వేలకు పైగా ధరలు పలుకగా ఈ సీజన్లో ఆర్ఎన్ఆర్ సన్న రకాలకు ఏకంగా రూ.2,424ధర పలికింది. ఎవరూ ఊహించని విధంగా సన్నరకం ధాన్యానికి ధరలు పలుకుతున్నాయి. ప్రభుత్వ మద్దతు ధర క్వింటాకు రూ.2,060 ఉండగా మార్కెట్లో క్వింటాకు రూ.2,424ధర పలుకుతున్నది. ఆర్ఎస్ఆర్ సన్నరకాలకు డిమాండ్ ఎక్కువగా ఉండడంతో వ్యాపారులు ధరలను పెంచి కొనుగోలు చేస్తున్నారు. గతేడాది కన్నా దాదాపు రూ.250ధర అధికంగా పలుకుతున్నది.
మార్కెట్ ప్రారంభంలో రూ.16వందలనుంచి రూ.18వందల మధ్య పలికిన ఆర్ఎన్ఆర్ ప్రస్తుతం రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. అయితే ఇంకా ఆరబెట్టి, చెత్తాచెదారం లేకుండా నాణ్యతగా తీసుకువస్తే మరింత ధరలు పెరుగుతాయని మార్కెట్ వర్గాలు తెలుపుతున్నాయి. ఆర్ఎన్ఆర్(తెలంగాణ సోన) ఈరకం బియ్యం సన్నగా, నాణ్యతగా ఉండటం, నూనెశాతం తక్కువ, షుగర్ పేషెంట్లకు బాగుంటుందనే ఆర్ఎన్ఆర్కు డిమాండ్ పెరిగింది. అదేవిధంగా గతంలో వేసే బీపీటీ(సోనరకం) ధాన్యాన్ని రైతులు అంతగా సాగుచేయకపోవడం కూడా ఈ సన్నాలకు ధరలు అధికంగా వస్తున్నాయి. ఈసారి ఆర్ఎన్ఆర్ రకం ధాన్యం మహబూబ్నగర్ జిల్లాలో అధికంగా, మిగతా జిల్లాలో తక్కువ మొత్తం సాగుచేశారని తెలుస్తున్నది. దీంతో కర్ణాటక, హైదరాబాద్, నిజాంబాద్, నల్లగొండ, ఆంధ్రప్రదేశ్, తదితర ప్రాంతాలకు సన్నరకం ధాన్యం ఎగుమతి అవుతుండటంతో డిమాండ్ పెరుగుతున్నది.
గతేడాది నుంచి తెలంగాణ ప్రభుత్వం కూడా సన్నాలను సాగుచేయాలని రైతులకు సూచించింది. యాసంగిలో ఎక్కువశాతం 1010దొడ్డురకం ధాన్యం సాగుచేసే అవకాశం ఎక్కువగా ఉండడంతో వచ్చే సీజన్ను కూడా దృష్టిలో ఉంచుకుని వ్యాపారులు సన్నరకాలకు ధరలు అధికంగా వేసి కొనుగోలు చేస్తున్నారు. ఈ సన్నరకాలకు ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని, రూ.25వందలకు పైగా ధరలు పలికే అవకాశం ఉందని వ్యాపారులు తెలుపుతున్నారు. అదేవిధంగా ఈ ఏడాది వర్షాలు బాగా కురిశాయి. మహబూబ్నగర్ జిల్లాలో వరిసాగు పెరగడానికి ప్రాజెక్టు నిర్మాణాలు దాదాపుగా పూర్తవడంతో ప్రాజెక్టుల కింద వరిసాగు చేస్తున్నారు. దాంతో అధిక మొత్తంలో వరిసాగవుతున్నది.
అధిక వర్షాల వలన వచ్చే యాసంగి సీజన్లోకూడా రైతులు వరిసాగువైపే ఎక్కువగా మొగ్గు చూపే అవకాశం ఉంది. ఈ సారి వర్షాలు సమృద్ధిగా కురువడం, చెరువులు, కుంటలు అలుగులు పారడంతో రైతులు ఎక్కువగా వరి సాగుచేశారు. వానకాలంలో మహబూబ్నగర్ జిల్లాలో లక్షా88వేల ఎకరాల్లో వరిసాగు చేశారు. గతేడాది వానకాలంలో లక్షా70వేల ఎకరాల్లో సాగుచేయగా ఈసారి 10వేల ఎకరాలు అధికంగా సాగైంది. వరికోతల సమయంలో వర్షాలు రాకపోవడం రైతుల అదృష్టంగా భావిస్తున్నారు.
బాదేపల్లి మార్కెట్ చరిత్రలో రికార్డ్
బాదేపల్లి వ్యవసాయ మార్కెట్లో ధాన్యానికి అత్యధిక ధరలు పలుకుతున్నాయి. మార్కెట్ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఆర్ఎన్ఆర్కు అధిక ధరలు వస్తున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలోనే ఆర్ఎన్ఆర్కు ఇంత పెద్దమొత్తంలో ధరలు రాలేదు. క్వింటాకు రూ.2,424ధర వచ్చింది. గతేడాది అత్యధికంగా ఆర్ఎన్ఆర్కు క్వింటాకు రూ.2,189ధర పలికింది.
ఇంతధర వస్తదనుకోలే..
సన్నరకాలకు ఇంత ధరలు వస్తాయని కలలోకూడా అనుకోలేదు. 6ఎకరాల్లో ఆర్ఎన్ఆర్, 9ఎకరాల్లో శ్రీరాంగోల్డ్ సన్నరకం ధాన్యం సాగు చేశా. దాదాపు దాదాపు 400బస్తాలకు పైగా ధాన్యం పండింది. నేను తీసుకొచ్చిన వడ్లకు క్వింటాకు రూ.2,424ధర వచ్చింది. ఇంత ధర రావడం నా సంతోషంగా ఉన్నది.
– సురేందర్గౌడ్, నెక్కొండ, జడ్చర్ల మండలం
ధాన్యం నాణ్యతగా తీసుకురావాలి
బాగా ఆరబెట్టి, చెత్తా చెదారం లేకుండా తూర్పుపట్టి ధాన్యాన్ని నాణ్యతగా తీసుకొస్తే మార్కెట్లో మంచి ధరలు వస్తున్నాయి. ఇప్పుడు వస్తున్న ధరలకంటే నాణ్యతగా తీసుకువస్తే మరింత ధరలు పెరిగే అవకాశం ఉన్నది. సన్నరకాల వడ్లకు డిమాండ్ ఉండడంతో వ్యాపారులు పోటీపడి ధరలు పెడుతున్నారు.
– నవీన్కుమార్, కార్యదర్శి, బాదేపల్లి మార్కెట్
నాణ్యతగా ఉండడం వల్లే ధరలు
ఈసారి వానకాలంలో వేసిన సన్న రకాలు మంచి నాణత్యగా ఉండటంతో వాటికి అధిక ధరలు పలుకుతున్నాయి. బీపీటీ (సోన) లేకపోవడంతో తెలంగాణ సోనకు మంచి డిమాండ్ ఉండడంతో ఇతర ప్రాంతాలకు ఎగుమతి అవుతు న్నాయి. దీంతో మార్కెట్లో సన్నరకాలకు ధర బాగావస్తున్నది. మహబూబ్నగర్ సోన మంచి క్వాలిటీగా ఉంది.
–ఏ మనోహర్, వ్యాపారి, జడ్చర్ల