జిల్లా పరిషత్ చైర్మన్లు, మండల ప్రజా పరిషత్ చైర్మన్లకు ప్రభుత్వం గౌరవం కల్పించనున్నది. ఎన్నడూ లేనట్లుగా చెక్ పవర్ కల్పిస్తూ నిర్ణయించింది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ త్వరలో అధికారికంగా ఉత్తర్వులు అందించనున్నది. దీంతో ఉమ్మడి పాలమూరు పరిధిలోని ఐదు జిల్లాల జెడ్పీ చైర్మన్లకు, మండలాలకు చెందిన ఎంపీపీలకు చెక్కులపై సంతకాలు చేసే అధికారం దక్కనున్నది.
నాగర్కర్నూల్, జూలై 3 (నమస్తే తెలంగాణ) : స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. మండల పరిషత్ చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్లకు చెక్పవర్ కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఫలితంగా పంచాయతీరాజ్శాఖ త్వరలో ఉత్తర్వులు వెలువరించనున్నది. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ సంస్థ ద్వారా గ్రామాల్లో పెద్దఎత్తున అభివృద్ధి పనులు చేపడుతున్నది.
పల్లెప్రగతి ద్వారా పారిశుధ్యం, పచ్చదనం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నది. ప్రతి నెలా గ్రామ జనాభాకు అనుగుణంగా నిధులను మంజూరు చేస్తున్నది. పంచాయతీలకు 14, 15వ సంఘంతో పాటుగా పలు రకాల నిధులు మంజూరు అవుతున్నాయి. ఈ నిధులతో గ్రామాల్లో సీసీరోడ్లు, డ్రైనేజీలు, ఇతర నిర్మాణ పనులు చేపడుతున్నారు. ఇంతకుముందు ఏ ప్రభుత్వంలోనూ గ్రామ పంచాయతీలకు నిధులు మంజూరు చేయడం, అభివృద్ధి పనులు జరగడం గగనంగా ఉండేది.
ఇప్పుడు ప్రతి గ్రామంలో ఎక్కడ చూసినా వివిధ రకాల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. చేసిన పనులకు గతంలో ట్రెజరీ ద్వారా బిల్లులు మంజూరవుతుండేవి. ప్రభుత్వ నిర్ణయంతో ఇప్పుడు నేరుగా పంచాయతీ ఖాతాల్లోనే జమవుతున్నాయి. అయితే ఈ బిల్లులను సంబంధిత కాంట్రాక్టర్లకు మంజూరు చేయడం, ఇతర పనులకు ఖర్చుచేయడం అధికారుల ద్వారా జరుగుతున్నది. జిల్లాస్థాయిలో ప్రథమ పౌరులుగా జెడ్పీచైర్మన్లు వ్యవహరిస్తుండగా బిల్లులు చెల్లించడం సీఈవోల చేతుల్లో ఉండేది. మండలస్థాయిలో ఎంపీపీలు ప్రథమ పౌరులుగా ఉండగా బిల్లులు ఎంపీడీవోలు చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు జిల్లాపరిషత్, మండల పరిషత్లో అభివృద్ధి పనులపై తీర్మానాలు చేస్తూ తీరా బిల్లులు మంజూరు, ఖర్చులు చెల్లించడానికి సదరు అధికారులపై ఆధారపడాల్సి వస్తున్నది.
కొందరు అధికారుల తీరుతో బిల్లుల చెల్లింపులో జాప్యం జరుగుతున్నది. దీంతో జెడ్పీ చైర్మన్లు, ఎంపీపీలకు చెక్పవర్ లేకపోవడమే కారణం. గ్రామస్థాయిలో సర్పంచ్, ఉపసర్పంచులకు చెక్పవర్ కల్పించారు. దీంతో చేసిన తీర్మానాల పనులకు బిల్లులు సకాలంలో మంజూరు చేయించలేక జెడ్పీచైర్మన్లు, మండల పరిషత్ చైర్మన్లు ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోతున్నారు. దీనివల్ల సర్పంచ్, ఉపసర్పంచులతో పోలిస్తే జెడ్పీ, మండల పరిషత్ చైర్మన్లకు ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజల్లోనూ ఈ నాయకులకు తగిన గౌరవం లభించడం లేదు. ఇక బిల్లులకు నెలల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి.
ఈ విషయాన్ని జెడ్పీ చైర్మన్లు, ఎంపీపీలు ఇటీవలే స్థానిక సంస్థల ఎమ్మెల్సీలు కవిత, పోచంపల్లి శ్రీనివాస్రెడ్డికి విన్నవించగా సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన సీఎం రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుకు చెక్పవర్ కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఫలితంగా త్వరలో అధికారికంగా ఉత్తర్వులు వెలువడనున్నాయి. సీఎం కేసీఆర్ నిర్ణయం పట్ల జెడ్పీ చైర్మన్లు, ఎంపీపీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల ఉమ్మడి పాలమూరులోని ఐదు జిల్లా పరిషత్ చైర్మన్లు, నాగర్కర్నూల్లో 20మంది ఎంపీపీలు, నారాయణపేటలో 11మంది ఎంపీపీలు, వనపర్తిలో 14మంది ఎంపీపీలు, గద్వాలలో 12మంది ఎంపీపీలకు చెక్పవర్ దక్కనుండటం విశేషం.
జెడ్పీ, మండల పరిషత్లో అభివృద్ధి పనులకు తీర్మానాలు చేస్తున్నాం. బిల్లుల చెల్లింపులో మాత్రం అధికారులపై ఆధారపడాల్సి వస్తున్నది. సీఎం కేసీఆర్కు విన్నవించడంతో చెక్పవర్ కల్పించడం సంతోషంగా ఉంది. చెక్పవర్ కల్పించేందుకు కృషిచేసిన ఎమ్మెల్సీ కవితకు కృతజ్ఞతలు. చేసిన పనులకు సకాలంలో బిల్లులు చెల్లించడం జరుగుతుంది. ఇకపై గ్రామాల్లో అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తవుతాయి.
– పద్మావతి బంగారయ్య, జెడ్పీ చైర్పర్సన్, నాగర్కర్నూల్