గద్వాల, జూన్ 22 : పౌష్టికాహార లోపం కారణంగా చిన్నారులు, బాలికలు, మహిళలు రక్తహీనతతో సతమవుతున్నట్లు జాతీయ కుటుంబ సర్వేలో వెల్లడైంది. రక్తహీనతతో బాధపడుతున్న వాటిలో జోగుళాంబ గద్వాల జిల్లా కూడా ఉన్నది. ప్రజల జీవన ప్రమాణ స్థాయి పెరగడం, ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుతో రక్తహీనత సమస్య తలెత్తుతున్నది. జిల్లాలో 64 శాతం మందికి పైగా రక్తహీనతతో బాధపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల్లో రక్తహీనత తగ్గించడానికి ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పౌష్టికాహారం పంపిణీ, ఆశల ద్వారా ఐరన్ మాత్రల పంపిణీ, ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం, ఆరోగ్యలక్ష్మి పథకం, వసతి గృహాల్లో హైజెనిక్ కిట్స్ అందజేస్తున్నా తీవ్రత మాత్రం తగ్గడం లేదు.
చిన్నారులు పుట్టిన సమయంలో తల్లి రక్తహీనతతో బాధపడడం, సరైన పాలు పట్టకపోవడం, ఐరన్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోకపోవడం, సురక్షిత నీరు తాగకపోవడం వంటి కారణాలతో రక్తహీనత పెరుగుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఐరన్ సంబంధిత ఆహారం తీసుకోకపోవడం, 16-25 ఏండ్లలోపు యువతులు ఎక్కువగా జంక్, ఫాస్ట్పుడ్ తీసుకోవడం, ఆకుకూరలు సరిగా తీసుకోకపోవడం, త్వరగా గర్భం దాల్చడం, ప్రసవం అయిన తర్వాత బిడ్డకు, బిడ్డకు గ్యాప్ లేకపోవడం వల్ల మహిళలు రక్తహీనత బారిన పడుతున్నారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం జోగుళాంబ గద్వాల జిల్లాలో 6-59 నెలల పిల్లలు 82.4 శాతం, 1-49 ఏండ్ల మహిళలు 64.60, 15-19 ఏండ్ల బాలికలు 66.9 శాతం రక్తహీనతతో బాధపడుతున్నట్లు వెల్లడించింది.
మహిళలు, చిన్నారులు, బాలికలు రక్తహీనత బారిన పడకుండా ఉండాలంటే పౌష్టికాహారం తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఐరన్ మాత్రలు, ఆకుకూరలు, బటాని పప్పు, తోటకూర, ఆవాల ఆకులు, మెంతులు, శనగపప్పు, సోయాబిన్, గుమ్మడి, పుచ్చకాయ, నువ్వులు, మినప పప్పు, మటన్ ఎక్కువగా తీసుకుంటే రక్తహీనత నుంచి బయటపడే అవకాశం ఉన్నది. దీనికి తోడు క్యాబేజి, మునగ ఆకులు, కొత్తమీర, కరివేపాకు, ఉసిరికాయలు ఎక్కువగా తీసుకుంటే కూడా మంచిది.
రక్తహీనతతో బాధపడుతున్న ఆడపిల్లల ఆరోగ్యానికి భరోసా కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ న్యూట్రీషన్ పేరుతో కిట్స్ రెడీ చేసింది. తొలిదశలో రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది జిల్లాలలో పంపిణీ చేయనుండగా అందులో ఉమ్మడి జిల్లాలో జోగుళాంబ గద్వాల, నాగర్కర్నూల్ జిల్లాలకు ప్రాధాన్యత ఇచ్చారు. రక్తహీనతతో బాధపడుతున్న వారికి బలమైన పౌష్టికాహారం అందించాలని ప్రభుత్వం సంకల్పించింది. ఈ ఆర్థిక సంవత్సరం నుంచి కేసీఆర్ న్యూట్రీషన్ కిట్ అందిస్తామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ప్రకటించారు.
దీంతో రక్తహీనతతో బాధపడుతున్న మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కిట్లో ఖర్జూర, ప్రోటీన్ బిస్కెట్స్, ఐరన్ మాత్రలతో కూడుకున్న కిట్స్ సిద్ధం చేయాలని నిర్ణయించి ఆ బాధ్యతను తె లంగాణ ఫుడ్స్కు బాధ్యతను అప్పగించింది. త్వ రలో రాష్ట్రంలో తొలి దశలో ఎంపిక చేసిన జిల్లాల కు అందజేయనున్నారు. దీంతో మహిళలు సంతో షం వ్యక్తం చేస్తున్నారు.