దేవరకద్రరూరల్, సెప్టెంబర్ 14: తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలని, వేడుకల్లో ప్రతిఒక్కరూ పాల్గొనాలని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం దేవరకద్ర నియోజకవర్గకేంద్రంలో అదనపు కలెక్టర్, అధికారులు, ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమీక్షలో ఎమ్మెల్యే ఆల పాల్గొని మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు 16, 17, 18వ తేదీల్లో నిర్వహించే తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను వైభవంగా నిర్వహించుకుందామన్నారు.
ఉత్సవాల్లో ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు భాగస్వాములు కావాలన్నారు. ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. 16న 20వేల మందితో ర్యాలీ, 17న జిల్లాకేంద్రంలో జాతీయ జెండావిష్కరణ ఉంటుందన్నారు. అదేరోజు హైదరాబాద్లో సీఎం కేసీఆర్ బంజారాభవన్, సేవాలాల్ భవన్ ప్రారంభించనున్నట్లు తెలిపారు. అనంతరం ఎన్టీఆర్ స్టేడియంలో సభ ఉంటుందన్నారు. కార్యక్రమాలకు అన్ని నియోజకవర్గాల నుంచి ప్రజలు తరలివెళ్లేందుకు రవాణా, తదితర ఏర్పాట్లు చేయాలన్నారు.
అనంతరం నిర్వహణ ఏర్పాట్లు, ర్యాలీ అనంతరం మండలకేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో సమావేశం, భోజన సదుపాయం కోసం వ్యవసాయ మార్కెట్ను సందర్శించి ఏర్పాట్లు పరిశీలించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సీతారామరావు, డీఎస్పీ మహేశ్కుమార్, ఎంపీపీలు రమాదేవి, హర్షవర్ధన్రెడ్డి, జెడ్పీటీసీలు, తాసిల్దార్ జ్యోతి, పార్టీ మండల అధ్యక్షుడు జెట్టి నర్సింహారెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.