2002లో పాతిక ఎకరాల్లో సేంద్రియ పద్ధతిన సాగు మొదలుపెట్టిన మహిళారైతుకు వచ్చిన ఆదాయం అక్షరాలా రూ.11.. అయినా సాగుపై మమకారం చంపుకోలేదు.. తనకున్న పొలానికితోడు మరో 40 ఎకరాలను కౌలుకు తీసుకొని మొత్తం 65 ఎకరాల్లో సేంద్రియ పద్ధతిన సేద్యం చేస్తున్నది. వరి, పత్తి, ఇతర పంటలు సాగు చేస్తూ ఏడాదికి రూ.11 లక్షల టర్నోవర్ సంపాదిస్తున్నది. 20కిపైగా ఆవులతో గోశాలను నిర్వహిస్తూ.. పేడ, మూత్రం ద్వారా సేంద్రియ ఎరువును తయారు చేస్తున్నది. కేవలం పదో తరగతే చదివినా.. వ్యవసాయంలో మాత్రం మాస్టర్ డిగ్రీలు చేసిన వారిలా సేంద్రియ సాగుపై శోధించింది. నాగర్కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలం కార్వంగ గ్రామానికి చెందిన లావణ్యరెడ్డి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నది. ఆమెను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు సైతం వరించాయి.
నాగర్కర్నూల్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వం, శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు రైతులకు ఎంత చెప్పినా రసాయన మందులు వాడి పంటల దిగుబడి సాధించేందుకు ఆపసోపాలు పడుతున్నారు. సేంద్రియ సాగుతో కలిగే లాభాలను నిరూపిస్తూ సేద్యం చేస్తున్నారు లావణ్యరెడ్డి. అచ్చంపేట మండలం రంగాపూర్కు చెందిన లావణ్య పదో తరగతి వరకు చదివి తెలకపల్లి మండలం కార్వంగ గ్రామానికి చెందిన రమణారెడ్డిని వివాహం చేసుకొంది. చదువుతో సంబంధం లేకుండా తెలివిగా వ్యవసాయం చేస్తూ నేటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. గ్రామంలో 25ఎకరాల భూమి ఉండగా, అదనంగా మరో 40ఎకరాలు కౌలుకు తీసుకొని వరి, పత్తి, ఇతర పంటలు సాగు చేస్తున్నారు. సేంద్రియ ఎరువులతో పండిస్తున్న పంటలు ఇతర రైతులకంటే దాదాపు 20రోజుల ముందుగానే దిగుబడి వస్తోంది. 2002లో తాము చేసిన సాగుతో పెట్టుబడి పోగా, చేతికి కేవలం రూ.11 వచ్చాయి. దీంతో ఎంత కష్టపడ్డా ఇలా లాభం వచ్చిందేంటని వారు ఎంతో దిగాలు చెందారు. ఈ క్రమంలోనే వేరుశనగ పంటకు సోకిన తెగులు ఆవుమూత్రంతో తగ్గిందని ఓ పత్రికలో వచ్చిన చిన్న ప్రకటన లావణ్య కంటపడింది. దీంతో భర్తతో కలిసి గోమూత్రం, దాని ద్వారా తయారయ్యే ఎరువుల లాభాల గురించి తెలుసుకున్నది. లావణ్య పదో తరగతే చదివినా.. వ్యవసాయంలో మాత్రం మాస్టర్ డిగ్రీలు చేసిన వారిలా సేంద్రియ సేద్యం గురించి శోధించింది. ఆవులను తీసుకొచ్చి పేడ, మూత్రం సేకరించడంతోపాటు ఎరువుగా మార్చింది. ఈ ఎరువులను పొలాల్లో చల్లుతూ పంటలు సాగు చేస్తోంది. ఇక పంటలకు పురుగు, తెగుళ్లు సోకితే రసాయన మందుల స్థానంలో కషాయాలను పిచికారీ చేయిస్తోంది.
కషాయాలతో పంటల సాగు..
దశపర్ని పేరిట జిల్లేడు, మారేడు, వాగిలి, గన్నేరు, ఉమ్మెత, తులసి, సీతాఫలం, జామ, నిమ్మ వంటి ఆకులతో కషాయాలను తయారు చేస్తోంది. ఇలా తయారుచేసిన ఎరువులు, పురుగుమందులు లావణ్యను ఆర్థిక నష్టాల నుం చిగట్టెక్కించాయి. నాడు పురుగుమందులు, ఎరువుల కోసం పెట్టిన ఖర్చులు సేంద్రియ సాగుతో భారీగా మిగిలాయి. కాగా, వర్షాభావ పరిస్థితుల్లో పత్తి పంటకు మజ్జిగను పిచికారీ చేయిస్తోంది. ఇలా తమ పొలంలో పంటలన్నీ సేంద్రియ పద్ధతిలో కొనసాగిస్తోంది. ఇందులో వరి, పత్తి ప్రధాన పంటలు కాగా కంది, కంది, నువ్వులు, ఆవాలు, ధాన్యా లు, మెంతులు, అల్లం, జిలకర, వెల్లుల్లి, ఉల్లిగడ్డను అంతర పంటగా సాగు చేస్తోంది. వరిలో దేశీ వెరైటీ రకాలు, కుంకుమ పువ్వు, ఢిల్లీ బాస్మతి, నవార, చిట్టి ముత్యాలు రకాలను కూడా సాగు చేస్తుండటం గమనార్హం. కుంకుమపువ్వు రకం బియ్యం మధుమేహం వచ్చిన వారిని సాధారణ స్థాయికి తీసుకొస్తుంది. ఈవిధంగా నవంబర్-డిసెంబర్లో 30రకాల పంటలను సాగు చేస్తోంది. ఇలా సేంద్రియ సాగుతో ఇతరుల కంటే రెండు వారాలు ముందుగానే దిగుబడి వస్తోంది. పురుగుమందులకు రూ.వేలల్లో పెట్టే ఖర్చుల స్థానంలో ఇండ్లల్లో లభించే ఆకులతో కషాయాలు తయారు చేస్తూ పంటల దిగుబడి గణనీయంగా తీసుకొచ్చేందుకు కృషి చేస్తోంది. సేంద్రియ ఎరువుల కోసం సొంతంగా 20కిపైగా అవులతో గోశాలను నిర్వహిస్తోంది. ఆవుల పాలను దూడలకు మాత్రమే తాపుతూ.. పాల విక్రయం చేపట్టకుండా పేడ, మూత్రం కోసమే గోవులను పెంచుతున్నారు.
రూ.11లక్షల లాభానికి..
లావణ్య చేపట్టిన సేంద్రియ సాగు గ్రామ, రాష్ట్ర సరిహద్దులను దాటింది. సేంద్రియ ఎరువులతో పంట సాగవుతున్న విషయం, ఆ పంటల వల్ల ఆరోగ్యానికి మేలని గ్రహించిన ప్రజలు ఆమెను ఫోన్లో సంప్రదించి వరి, మిర్చి, సుగంధ ద్రవ్యాలను కొనుగోలు చేసేందుకు ఇంటికి వస్తున్నారు. కొందరు ఫోన్లో ఆర్డర్లు ఇస్తూ విదేశాలకు సైతం తీసుకెళ్తుండడం విశేషం. ఈక్రమంలో మిర్చికి లావణ్య బ్రాండ్ పేరిట విక్రయాలు ప్రారంభించారు. ఇక తాము పండిస్తున్న వరికి గతంలో ‘పాలమూరు రైస్’ అని పేరు పెట్టగా జిల్లాలు మారడంతో ‘కందనూలు రైస్’ పేరిట అమ్మకాలు సాగిస్తున్నారు. సేం ద్రియ సాగుతో చేపట్టిన పంటలు కావడంతో వ్యాపారం దినదినాభివృద్ధి చెందుతోంది. ప్రతి శని, ఆదివారాల్లో ప్రజలు ఇంటి వద్దకు వచ్చి ఆయా ధాన్యాలు కొనుగోలు చేస్తుంటారు. ఈ వ్యాపారంతో తాను లాభాలు ఆర్జిస్తూనే రోజుకు 10మంది చొప్పున, ఏడాది పొడవునా వందల మం దికి ఉపాధి కల్పిస్తోంది. ఇలా కూలీలకు నెలకు రూ.10లక్షల వరకు చెల్లిస్తూనే తానూ లాభం పొం దుతున్నారు. ఇలా 2002లో రూ.11 లాభం మా త్రమే చూసిన లావణ్య ఇప్పుడు రూ.11లక్షలకు చే రుకొని రైతులు, మహిళలకు ఆదర్శంగా నిలిచారు.
ప్రముఖుల చేతులమీదుగా అవార్డులు..
అదేవిధంగా ఆమె వ్యాపారం అవార్డులనూ తీసుకొచ్చింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా ప్రభుత్వం మహిళా రైతు పురస్కారం కూడా అందించింది. 2014లో ప్రధాని మోదీ చేతులమీదుగా కృషి రత్న అవార్డు, నాటి కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రాధామోహన్ చేతుల మీదుగా హల్దార్ ఆర్గానిక్ ఫార్మర్ అవార్డు, రైతునేస్తం అవార్డును పొందారు. అప్పటి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా దేవీ అవార్డును కూడా తీసుకొన్నారు. నాటి వ్యవసాయశాఖ మంత్రి, నేటి స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి కార్వంగలో లావణ్య పొలానికి వచ్చి సేంద్రియ సాగు గురించి అడిగి తెలుసుకున్నారు.
గ్లామర్ కాదు గ్రామర్ ఉందన్న వెంకయ్య
ఢిల్లీలో అవార్డు అందుకుంటున్న సమయంలో లావణ్య గొప్పతనాన్ని మెచ్చుకున్నారు నాటి రాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ఈ అవార్డులను అందుకునే సందర్భంలో ఓ మహిళా పోలీసు అధికారి మాట్లాడుతూ ఎంత చదువుకున్నావ్ అని లావణ్యను అడిగింది. పదో తరగతి అని లావణ్య సమాధానం చెప్పింది. ఆఫ్ట్రాల్ పది చదివిన నీకు, నాకూ ఒక్కటే అవార్డా? అంటూ చిన్నచూపు చూస్తూ మాట్లాడింది. ఈ మాటలు విన్న వెంకయ్యనాయుడు ఆ అధికారిని పిలిచి ఏమన్నారు.. మరోసారి చెప్పండి అని అడగ్గా ఆమె ఏం లేదు సార్ అని బదులిచ్చారు. ప్రతిభకు చదువు అడ్డు కాదు.. మన దేశానికి అన్నం పెట్టే రైతన్నలు, మహిళా రైతుల మేధస్సును గుర్తించాలి.. నీకు గ్లామర్ ఉంది.. తనకు గ్రామర్ ఉంది.. ఇలా చదువు లేదని, ఇతరులను కించపర్చొద్దని వెంకయ్య ఘాటుగా చెప్పిన సంఘటన తనను ఇంకా ఉత్తేజపర్చిందని లావణ్య చెప్తున్నారు.
సేంద్రియ సేద్యంతో పంట పెట్టుబడులకు అయ్యే ఖర్చు బాగా తగ్గుతుంది. ఈ ధాన్యం తింటే ఆరోగ్యం కూడా బాగుంటుంది. ప్రతి ఒక్కరూ సేంద్రియ సేద్యం చేస్తే లాభాలతోపాటు ప్రజలకు ఆరోగ్యాన్ని కూడా ఇవ్వగలుగుతాం. సేంద్రియ సాగులో భాగంగా తొలుత గోవులను పెంచడం, పురుగు మందులకు బదులుగా కషాయాలు తయారు చేయడం చూసి ఊళ్లోని వారు నవ్వేవాళ్లు. కానీ నా భర్త అండగా నిలిచారు. ఇప్పుడు ఆ ప్రజలే నాకు వచ్చిన అవార్డులు, ఇంటికి వస్తున్న ప్రజలను చూసి పొగుడుతున్నారు. లావణ్య గ్రేట్ అంటుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నాకు అవార్డులు కూడా ఇచ్చాయి. నాటి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఇచ్చిన ప్రశంసను ఎప్పటికీ మరిచిపోలేను. తెలివి ఉండి కష్టపడితే ఏదైనా సాధించవచ్చు. 2002లో లాభం రూ.11మాత్రమే వచ్చినా కుంగిపోలేదు. ఛాలెంజ్గా తీసుకున్నా. ఇప్పుడు సంవత్సరమంతా పొలం పనులు చేస్తూ కూలీలకు రూ.10లక్షల వరకు ఇస్తూ మేమూ రూ.11లక్షలు సంపాదిస్తున్నాం. మేము వేసే మిర్చీ, పండించే బియ్యం రుచిగా ఉంటాయని హైదరాబాద్తోపాటు ఇతర జిల్లాల నుంచి వచ్చి కొనుక్కుంటుంటారు. ఇది చూసి గతంలో మేము పడిన కష్టం, అవమానాలను పూర్తిగా మర్చిపోయాం. నాటి కష్టాలే మాకు పెట్టుబడులుగా మారాయి.
– లావణ్య, మహిళా రైతు, కార్వంగ