వనపర్తి, మార్చి 15 : నైపుణ్యం ఉంటే ఏ రంగంలోనైనా రాణించవచ్చని కలెక్టర్ తేజస్నందలాల్ పవార్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో రెండో బ్యాచ్ ప్రారంభోత్సవం సందర్భంగా ల్యాంప్ లైటింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు తమ వృత్తి పట్ల శ్రద్ధ, భక్తి, సేవాభావం కలిగి ఉండాలాన్నారు. దవఖానకు వచ్చే రోగి ధనికుడైనా పేదవాడైనా అందరికీ సమానంగా సేవలు అందించాలన్నారు. వారిలో మనోధైర్యాన్ని నింపడమే కాకుండా జబ్బును నయం చేసే కీలకపాత్ర నర్సులదన్నారు.
నర్సింగ్ రంగంలో ఉండేవారి సేవలు ఎంతో ముఖ్యమని కరోనా లాంటి కష్టకాలంలో నర్సుల సేవలు ఎంతో కీలకంగా నిలిచాయని కలెక్టర్ గుర్తు చేశారు. ఏ రంగంలో అడుగు పెట్టినా ఆ వృత్తిలో ఉన్న విలువలను ఆకళింపు చేసుకొని పరిస్థితులకు అనుగుణంగా నైపుణ్యాలను పుణికిపుచ్చుకోవాలన్నారు. ప్రతి ఒక్క విద్యార్థికి తరగతి గదిలో నేర్చుకునే విషయాలతో పాటు క్షేత్రస్థాయిలో వెళ్లి నేర్చుకునే ప్రాక్టికల్ శిక్షణ ఎంతో ముఖ్యమన్నారు. శిక్షణలో ఉన్నపుడు మనకు ఏదైనా తెలియని విషయం ఉంటే తెలిసిన వారి నుంచి అడిగి నేర్చుకోవాలన్నారు.
ప్రతి ఒక్కరికీ భాషా నైపుణ్యం కూడా ముఖ్యమని తెలుగుతోపాటు ఇంగిష్ భాషలో నైపుణ్యం సాధించాలని సూచించారు. అదేవిధంగా నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఇంద్ర ఝూన్సీబాయి, డీపీఆర్వో సీతారాం మాట్లాడారు. అంతకుముందు కలెక్టర్ కళాశాల ప్రిన్సిపాల్తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో అడ్మిన్ విభాగం సిబ్బంది శ్రీధర్రెడ్డి, రవీందర్,అధ్యాపక బృందం ప్రవీణ్, సరస్వతీతోపాటు విద్యార్థినులు పాల్గొన్నారు.