పంచాయతీలకు ఏప్రిల్, మే నెల గ్రాంట్ల విడుదల
కందనూలుకు అత్యధికంగా రూ.9.60 కోట్లు..
వనపర్తికి అత్యల్పంగా రూ.5.39 కోట్లు
పల్లెప్రగతికి ఆర్థికంగా చేయూత
మాట నిలబెట్టుకుంటున్న సీఎం కేసీఆర్
పల్లెప్రగతికి లక్ష్మీ కటాక్షించింది. ఉమ్మడి జిల్లాలోని జిల్లా పరిషత్, మండల, గ్రామ పంచాయతీలకు జనరల్, స్పెషల్ కాంపోనెంట్ ఫండ్ కింద నిధులు జమయ్యాయి. జీపీలో జనాభా మేరకు ఈ కేటాయింపులు చేశారు. అత్యధికంగా నాగర్కర్నూల్కు రూ.9.60 కోట్లు, వనపర్తికి అత్యల్పంగా రూ.5.39 కోట్ల చొప్పున మంజూరయ్యాయి. గ్రామాల అభివృద్ధికి రెండేండ్లుగా సీఎం కేసీఆర్ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అయితే ఎక్కడా నిధుల సమస్య లేకుండా చర్యలు చేపట్టారు. రెండేండ్లుగా పంచాయతీలకు ప్రతినెలా గ్రాంట్లను మంజూరు చేస్తున్నారు. దీంతో గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి పంచాయతీలకు ఆర్థిక కష్టాలు తీరాయి.
నాగర్కర్నూల్, జూన్ 14 ( నమస్తే తెలంగాణ) : గ్రామపంచాయతీల అభివృద్ధికి సర్కార్ చర్యలు చేపడుతున్నది. పల్లెలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారు. ప్రధానంగా పల్లెప్రగతి అద్భుత ఫలితాలను ఇస్తున్నది. ఈ పథకం ద్వారా గ్రామాల్లో పారిశుధ్యం, పచ్చదనం, మొక్కలు నాటడంతోపాటు పిచ్చి మొక్కల తొలగింపు తదితర కార్యక్రమాలు చేపడుతున్నారు. దీంతో సీజనల్ వ్యాధులు తగ్గుముఖం పట్టాయి. మలేరియా, డెంగీ వంటి కేసులు సున్నాకు చేరుకున్నాయి. అయితే, గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం నిధులను మంజూరు చేస్తున్నది. పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ నిధులను విడుదల చేస్తుంది. దీంతో గ్రామంలో సమస్యల పరిష్కారంలో పంచాయతీ పాలకవర్గానికి ఇబ్బందులు తొలిగాయి. ప్రస్తుతం ఐదో విడుత పల్లెప్రగతి అమలవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం గత రెండు నెలలకు సంబంధించి వివిధ రకాల నిధులను విడుదల చేసింది. ఉమ్మడి మహబూబ్నగర్లోని ఐదు జిల్లాలకు సంబంధించి నేరుగా ఆయా గ్రామపంచాయతీల ఖాతాల్లో నిధులు జమయ్యాయి. దీంతో పల్లెప్రగతిలో భాగంగా అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఇందులో మండల, జిల్లా పరిషత్, గ్రామపంచాయతీలకు సంబంధించి జనరల్ ఫండ్, స్పెషల్ కాంపోనెంట్ ఫండ్ కింద ఆయా నిధులు జమయ్యాయి. గ్రామపంచాయతీ జనాభాను బట్టి నిధులు కేటాయించారు. అత్యధికంగా నాగర్కర్నూల్కు రూ.9.60 కోట్లు, వనపర్తికి అత్యల్పంగా రూ.5.39 కోట్ల చొప్పున మంజూరయ్యాయి.
నిధుల సమస్య లేదు..
గ్రామపంచాయతీల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఐదు విడుతలుగా జరుగుతున్న పల్లెప్రగతితో పంచాయతీల్లో సమస్యలు దాదాపుగా పరిష్కారమయ్యాయి. పారిశుధ్యం సమస్య పూర్తిగా తొలగిపోయింది. నిధులు కూడా మంజూరు కావడంతో అభివృద్ధి పనులు చేపట్టడం సులభంగా మారింది. గత రెండు నెలలకు సంబంధించి గ్రామపంచాయతీలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది.
– పుష్ప, డీపీవో, నాగర్కర్నూల్