జడ్చర్ల టౌన్, జూన్ 23 : పట్టాల మీదుగా వెళ్తున్న గూడ్స్రైలు వ్యాగన్లు విడిపోయిన ఘటన శుక్రవారం జడ్చర్ల రైల్వేస్టేషన్లో చోటుచేసుకున్నది. స్థానికుల కథనం ప్రకారం.. కాచిగూడ నుంచి డోన్కు 40 వ్యాగన్లతో వెళ్తున్న గూడ్స్ రైలు శుక్రవారం ఉదయం 8గంటలకు జడ్చర్ల రైల్వేస్టేషన్లోని మూడో ప్లాట్ఫాం మీదకు చేరుకోగానే ఒక్కసారిగా రైలు మధ్యలో ఊడిపోయి రెండుగా వ్యాగన్లు విడిపోయాయి. ఇంజిన్తో కొన్ని వ్యా గన్లతో రైలు ముందుకు వెళ్లిపోగా, విడిపోయిన వ్యాగన్లు పట్టాలపైనే నిలిచిపోయాయి. వెంటనే డ్రైవర్ అప్రమత్తమై బ్రేకులు వేయడంతో దాదాపు 300 మీటర్లు ముం దుకెళ్లి రైలు ఆగింది. తర్వాత రైలును రివర్స్లో రప్పించి విడిపోయిన వ్యాగన్లను జతచేశారు. అరగంట తర్వాత గూడ్స్ రైలు అక్కడి నుంచి డోన్కు బయలుదేరింది. గూడ్స్ రైలు డ్రైవర్ అప్రమత్తమవడంతోనే విడిపోయిన వ్యాగన్లను సకాలంలో జతచేయగలిగారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. ఆ సమయంలో అదే ట్రాక్పై మరో రైలు వచ్చి ఉంటే పెద్ద ప్రమాదం జరిగేదని స్థానికులు తెలిపారు. ఈ విషయంపై జడ్చర్ల రైల్వేస్టేషన్ మాస్టర్ శంకర్ను వివరణ కోరగా.. కాచిగూడ నుంచి డోన్కు 40ఖాళీ వ్యాగన్లతో వెళ్తున్న గూడ్స్ రైలు మధ్యలో వ్యాగన్లు విడిపోయినట్లు తెలిపారు. తక్షణమే రైల్వే అధికారులు, సిబ్బంది విడిపోయిన వ్యాగన్లను జతచేసి అరగంటలోపు గూడ్స్రైలు యథావిధిగా వెళ్లేలా చర్యలు తీసుకున్నారని తెలిపారు. ఇదిలా ఉండగా, గూడ్స్ రైలు వ్యాగన్లు విడిపోయిన సమయంలో అక్కడే ఉన్న ప్రయాణికులు ఏం జరుగుతుందో తెలియక ఆందోళనకు గురయ్యారు.