జడ్చర్ల, ఫిబ్రవరి 9 : గంగాపురం శ్రీలక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయం ఉమ్మ డి జిల్లాలోనే ప్రసిద్ధి గాంచింది. ఏటా మాఘశుద్ధ పాఢ్యమిన బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. ఇందులో భాగంగా 10 నుంచి 18వ తేదీ వరకు ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. వేడుకలకు తెలంగాణ ప్రజలే కాకుండా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. శనివారం నుంచి 18వ తేదీ వరకు ఉత్సవాలను నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆలయాన్ని రంగులతో తీర్చిదిద్ది విద్యుద్దీపాలతో సుందరంగా అలంకరించారు.
లక్ష్మీసమేతుడైన నారాయణుడు ఈ క్షేత్రంలో చెన్నకేశవుడు స్వయంభువుగా వెలిశాడని పురాణాలు చెబుతున్నాయి. కృతయుగంలో మత్స్యపురిగా, త్రేతాయుగంలో దురిత కోలాహలంగా, ద్వాపరయుగంలో మాయాపురంగా, కలియుగంలో గంగాపూర్గా వెలుగొందుతున్న ప్రాంతం. పాల్కురికి సోమనాథుని పండితారాధ్య చరిత్రలో గంగాపురం చెన్నకేశవస్వామి ఆలయ ప్రాముఖ్యతను వివరించారు. ఈ ఆలయ శిల్పకళ చూపరులను కట్టిపడేస్తుంది. తొలుత రాతితో నిర్మించిన ప్రాకారం, దానిపై మట్టితో నిర్మించిన ప్రాకారం ఉండడంతో ఇతర ఆలయాలకు
భిన్నంగా కనిపిస్తుంది. ఈశా న్య దిశలో రాతితో నిర్మించిన లోతైన పుష్కరిణి (కోనేరు) ఉన్నది. ఉత్సవాలు ఇలా.. 10న పుణ్యాహవాచనం, అష్టోత్తర శత(108)కలశాలతో అభిషేకం, 11న అంకురార్పణ, పల్లకీసేవ, 12న ధ్వజారోహణం, హనుమత్ వాహనసేవ, 13న తిరుకల్యాణం, రాత్రి 9 గంటలకు స్వామి కల్యాణం, 14న శేషవాహన, హంసవాహన సేవలు, 15న పుష్పరథం(చిన్నతేరు), 16న రాత్రి 10 గంటలకు రథోత్సవం (పెద్దతేరు), 17న శకటోత్సవం(బండ్లు), 18న చక్రతీర్థంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.
ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటాం. మంచినీటి సమస్య లేకుండా మిషన్ భగీరథ నీటితోపాటు ట్యాంకర్లు ఏర్పాటు చేస్తాం. రాత్రి వేళ భక్తులు ఉండేందుకు షెడ్లల్లో వసతి, సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాం. అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయిస్తాం. హెల్త్క్యాంప్, కాలకృత్యాల కోసం మరుగుదొడ్ల సౌకర్యం కల్పించాం. మహబూబ్నగర్, కల్వకుర్తి, షాద్నగర్ డిపోల నుంచి ప్రత్యేక బస్సులు తిరుగనున్నాయి. దర్శనం కోసం క్యూలైన్లను ఏర్పాటు చేశాం.