మరికల్, డిసెంబర్ 26 : సృష్టికి మూలం అమ్మానాన్నలు.. అలాంటి తల్లిదండ్రుల పేరుమీద ఇతరులకు సేవ చేసే భాగ్యం దొరకడం అదృష్టం. అమ్మ, నాన్న, గురువు తర్వాతే దైవం అన్నారు. అమ్మ.. నాన్న పేరుతో ఉచిత అంబులెన్సులను ఏర్పాటు చేసి పేదలపాలిట ఆపద్బాంధవులుగా నిలుస్తున్నారు. అమ్మానాన్నలను భారంగా భావించి వృద్ధాశ్రమాల్లో చేర్పిస్తున్న ఈ రోజుల్లో తమను వీడిన అమ్మానాన్నల రుణం తీర్చుకోవడం కోసం ఇతరులకు సహాయం చేస్తున్నారు ఆ యువకులు.
నారాయణపేట జిల్లా మరికల్ మండలకేంద్రానికి చెందిన యువకుడు అయ్యప్ప తన తండ్రి జగదీశ్ అనారోగ్యంతో బాధపడుతుండగా దవాఖానకు తీసుకెళ్లడానికి అంబులెన్స్ లేకపోవడంతో ప్రైవేట్ వాహనంలో దవాఖానకు తరలిస్తుండగా మరణించాడు. దీంతో తాను అనుభవించిన కష్టాలు ఇతరులకు రావొద్దనే ఉద్దేశంతో తన పుట్టినరోజులకు తన తల్లి ఇచ్చే డబ్బులు కూడబెట్టి రూ.6లక్షలతో రెండేండ్ల కిందట తన తండ్రి గురుస్వామి జగదీశ్ పేరుమీద మండలకేంద్రంలో ఉచితంగా అంబులెన్స్ సేవలను ప్రారంభించారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు అంబులెన్స్కు ఫోన్ చేసి సేవలు పొందుతున్నారు.
కేవలం డీజిల్ మాత్రమే పోయించి మహబూబ్నగర్, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు చేరవేసి రోగులకు ఉచిత సేవలు అందిస్తున్నారు. అలాగే మండలకేంద్రానికి చెందిన శివకుమార్ తల్లి శెట్టిమల్లమ్మ చిన్నతనంలో మరణించడంతో గతేడాది తన తల్లి శెట్టిమల్లమ్మ పేరుమీద అంబులెన్స్ను ఏర్పాటు చేశాడు. ధన్వాడ, మరికల్ మండలాలకు ఉచితంగా అంబులెన్స్ సేవలను అందిస్తూ పేదలకు సేవ చేస్తున్నారు. మండలకేంద్రానికి చెందిన ఇద్దరు యువకులు తమ అమ్మానాన్నల పేరుతో ఉచిత అంబులెన్స్లు ఏర్పాటుచేసి ప్రజలకు సహాయం చేయడం అభినందనీయమని మండల ప్రజలు అంటున్నారు. మండల ప్రజలు తమకు అవసరం ఉన్న సమయాల్లో 70954 39108, 8008283108 నెంబర్లకు ఫోన్ చేస్తే చాలు కుయ్.. కుయ్.. అంటూ అంబులెన్స్ సేవలను అందిస్తున్నారు.
సేవ చేయాలనే లక్ష్యంతో..
మా నాన్న పడిన ఇబ్బంది మరొకరు పడొద్దని, అలాగే ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో మరికల్ మండలకేంద్రంలో ఉచిత అంబులెన్స్ ఏర్పాటు చేశాను. మహబూబ్నగర్, హైదరాబాద్ వంటి ప్రాంతాలకు తీసుకెళ్లి సేవలందిస్తున్నాం. ఇప్పటివరకు సుమారు 840మందికి సేవలందించాము. అంబులెన్స్తో ప్రజలకు సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నా.. మా నాన్న ఆధ్యాత్మికంగా ఇక్కడి ప్రజలకు తెలుసు. ఆయన జ్ఞాపకార్థం అంబులెన్సు ఏర్పాటు చేశాను.
– అయ్యప్ప, అడ్వకేట్, మరికల్
మిత్రుడి సలహా మేరకు..
మా అమ్మ పేరున ఏదైనా సేవ చేయాలనే ఆలోచన ఉందని నా స్నేహితుడు అయ్యప్పతో మాట్లాడాను. వెంటనే ఉచిత అంబులెన్స్ ఏర్పాటు చేయమని చెప్పగానే మరో వెంటనే మరికల్, ధన్వాడ ప్రజలకు అందుబాటులో ఉండేలా ఉచితంగా అంబులెన్స్ సేవలు ప్రారంభించాను. మూడు నెలల కిందట నారాయణ పేట ఎమ్మెల్యే రాజేందర్డ్డి చేతుల మీదుగా అంబులెన్స్ను ప్రారంభించాను. ఇప్పటివరకు 510మంది అంబులెన్స్ సేవలను వినియోగించుకున్నారు.
– శివకుమార్, మరికల్